తమ దేశంపై దాడిచేసి, వందలాదిమంది పౌరులను హతమార్చిన హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయిల్ సైనికులు ముప్పేట దాడి చేస్తున్నారు. ఐప్పటికే 1500 మందికి పైగా మిలిటెంట్లను మట్టుబెట్టినట్లు ప్రకటించింది. గాజాకు నీరు,విద్యుత్, ఇంధన సరఫరాలను సైతం పూర్తిగా నిలిపి వేసి హమాస్ స్థావరాలే క్షంగా దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ సైనికులు హమాస్తో ఏ విధంగా పోరాటం చేస్తున్నారు తెలియజేసే ఓ వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్( ఐడిఎఫ్) తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.
‘శనివారం ఇజ్రాయెల్పై దాడి చేసి 250 మందిని హమాస్ బందీలుగా చేసుకుంది. గాజా సరిహద్దుల్లో వారిని బంధించిందనే సమాచారంతో ఇజ్రాయెల్ రక్షణ దళాలు(ఐడిఎఫ్)హమాస్ మిలిటెంట్ స్థావరాలపై దాడి చేసి బందీలను సురక్షితంగా విడిపించాయి. ఈ దాడుల్లో 60 మంది మిలిటెంట్లను ఐడిఎఫ్ మట్టుబెట్టింది. హమాస్ దక్షిణ నేవీ కమాండర్ డిప్యూటీ కమాండర్ ముహమ్మద్ అబూ ఆలీ సహా 26 మంది మిలిటెంట్లను మా దళాలు అదుపులోకి తీసుకున్నాయి’ అని ఆ ట్వీట్లో తెలిపింది.
ఐడిఎఫ్ దళాలు ఉగ్రవాదులు నక్కి ఉన్నగదుల్లోకి తూటాల వర్షం కురిపిస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. అనంత రం వారిని బైటికి రప్పించడానికి గ్రనేడ్తో దాడి చేసి బం ధించాయి. దాడిలో పాల్గొన్న ఓ ఇజ్యాల్ సైనికుడి బాడీ కెమెరాలో ఈ దృశ్యాలన్నీ రికార్డు అయ్యాయి. ఈ వీడియోను ఇజ్రాయెల్ సైన్యం సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో వైరల్ అయింది.
ఇదిలా ఉండగా హమాస్ చెరలో ఇంకా దాదాపు 150 మంది ఇజ్రాయెల్, ఇతర దేశాల పౌరులు బందీలుగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని టన్నెళ్లలో బంధించినట్లు తెలుస్తోంది. వారికి విడిపించడానికి ఇజ్రాయెల్ గౌండ్ ఆపరేషన్కు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే గాజాలోని పౌరులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
24 గంటల్లో ఉత్తర గాజాలో ఉన్న 11 లక్షల మంది పౌరులు ఆ ప్రాంతాన్ని వీడాలని ఐడిఎఫ్ హెచ్చరికలు జారీ చేసింది. హమాస్ మిలిటెంట్లు పౌరులను రక్షణ కవచాలుగా వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారని, రాబోయే రోజుల్లో గాజానగరంపై ఐడిఎఫ్ దాడులను పెంచనుందని, ఇందులో అ మాయకులైన పౌరులకు నష్టం వాటిల్లకూడదని కోరుకుంటున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ విషయాన్ని తాము ఐక్యరాజ్య సమితికి కూడా తెలియజేసినట్లు పేర్కొంది. ఈ ప్రకటన ఇప్పటికే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతున్న పాలస్తీనియన్లలో మరింత భయాందోళనలను రేకెత్తిస్తోంది. అయితే ఈ ఆదేశాలపై ఐక్యరాజ్య సమితి తీవ్ర అభ్యంతరాలు తెలియజేసింది.
ఈ పరిణామాలు దారుణమైన మానవతా సంక్షోభాన్ని సృష్టిస్తాయ ని ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలో స్కూళ్లు, క్లినిక్లు నడుపుతున్న ఐరాస కేంద్రాలు, సిబ్బంది కూడా ఖాళీ చే సి వెళ్లి పోవాల్సి ఉంటుందని, ఈ ఆదేశాలను వెనక్కి తీ సుకోవాలని కోరుతున్నామని ఐరాస పేర్కొంది.
ఇప్పటివరకు గాజాలోని 3,600 హమాస్ స్థావరాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ వైమానిక దళం ఒక ప్రకటనలో తెలిపింది. ఆరు రోజుల్లో నాలుగు వేల టన్నుల బరువున్న 6,000కు పైగా బాంబులను గాజాపై జారవిడిచినట్లు తెలిపింది. మరో వైపు యుద్ధంలో ఇజ్రాయెల్ వైట్ ఫాస్పరస్ బాంబులను ఉపయోగిస్తున్నట్లు న్యూయార్క్కు చెందిన హ్యూమన్ రైట్స్ వాచ్ అనే సంస్థ ఆరోపించింది. ఇవి పౌరులపై దీర్ఘకాలిక ప్రభావం చూపిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది.