కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయిన ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చింది. ఈ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడించింది. బ్యారేజ్ ప్లానింగ్, డిజైన్ సరిగా లేదని తేల్చింది. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ ఆపరేషన్ మెయింటెనెన్స్ వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయాయన్నారు.
బ్యారేజ్ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోయిందని.. ఫౌండేషన్ మెటీరియల్ పటిష్టంగా లేదని తేల్చారు. బ్యారేజ్ లోడ్ వల్ల కాంక్రీట్ బ్రేక్ అయిందని తెలిపారు. బ్యారేజీని తేలియాడ నిర్మాణంగా రూపొందించారు కానీ స్థిరమైన నిర్మాణంగా నిర్మించలేదని రిపోర్టులో వెల్లడించారు. బ్యారేజీ వైఫల్యం వల్ల ఆర్థిక వ్యవస్థకు ప్రజా జీవితానికి తీవ్ర ప్రమాదం ఉందని చెప్పారు. బ్యారేజ్ బ్లాక్లలో సమస్య వల్ల మొత్తం బ్యారేజ్ ఉపయోగించడానికి అవకాశం లేదని స్పష్టం చేశారు.
ఈ దశలో రిజర్వాయర్ నింపితే బ్యారేజ్ మరింత కుంగుతుందని హెచ్చరించారు. మేడిగడ్డ తరహాలోనే అన్నారం, సుందిళ్ల నిర్మించారని.. ఈ రెండు ప్రాజెక్టులలో ఇవే పరిస్థితిలో వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. వెంటనే యుద్ధ ప్రాతిపదికన అన్నారం, సందిళ్లను తనిఖీ చేయాలని సూచించారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మొత్తం బ్యారేజ్ని పునాదుల నుంచి తొలగించి తిరిగి పూర్తిగా నిర్మించాలని చెప్పారు. కమిటీ కోరిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని పేర్కొంటూ 20 అంశాలు అడిగితే కేవలం 12 అంశాల వివరాలను మాత్రమే ఇచ్చిందని రిపోర్టులో వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన డేటా అసంపూర్ణంగా ఉందని తెలిపారు.
గతనెల 22న మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోగా, ఈ ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆరుగురు సభ్యుల కమిటీని నియమించింది. ఈ కమిటీ రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించింది. రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో మేడిగడ్డను పరిశీలించింది. అనంతరం ఢిల్లీకి వెళ్లిన ఈ కమిటీ తాజాగా 43 పేజీలతో కూడిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.
ఈ నివేదికలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొనడం తెలంగాణ ఎన్నికల వేళ హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుండగా.. ప్రస్తుత నివేదిక ఆ హీట్ను మరింత పెంచనుంది.