సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. చంద్రమోహన్ నిష్క్రమణ సృజనాత్మక ప్రపంచంలో పూరించలేని శూన్యతను కలిగించిందంటూ ప్రధాని ట్వీట్ చేశారు.
‘‘ప్రముఖ తెలుగు నటుడు శ్రీ చంద్ర మోహన్ గారు మృతి చెందడం అత్యంత బాధాకరం. సినీ ప్రపంచంలో ఆయన ఓ వెలుగు వెలిగారు. వారి ఉత్తమమైన నటన మరియు ప్రత్యేకమైన తేజస్సు తరతరాలుగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. వారి నిష్క్రమణ సృజనాత్మక ప్రపంచంలో పూరించలేన ఒక శూన్యతను కలిగించింది. నా ఆలోచనలు వారి కుటుంబం మరియు అసంఖ్యాక అభిమానులతో ఉన్నాయి. ఓం శాంతి’’ అంటూ ప్రధాని తెలుగులో ట్వీట్ చేశారు. చంద్రమోహన్ మృతి పట్ల ప్రధాని ఇంగ్లిష్లోనూ ట్వీట్ చేశారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తదితరులు చంద్రమోహన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. చిరంజీవి, మోహన్ బాబు, పవన్ కళ్యాణ్, వెంకటేశ్, మహేశ్ బాబు తదితర సినీ ప్రముఖులు చంద్రమోహన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. విభిన్న పాత్రలతో ఆకట్టుకున్న చంద్రమోహన్ మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని ప్రముఖులు అభిప్రాయపడ్డారు.