ఏపీలో టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు ఏపీ సీఐడీ మంగళవారం నోటీసులు జారీ చేసింది. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన ఓ సీఐడీ కానిస్టేబుల్ కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబుకు నోటీసు అందించారు. టిడిపి బ్యాంకు ఖాతాల వివరాలు అందజేయాలంటూ సీఐడీ తన నోటీసుల్లో పేర్కొంది.
ఈ నెల 18 లోగా వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. పార్టీ ఖాతాలోకి వచ్చిన విరాళాల వివరాలు అందజేయాలని సీఐడీ తన నోటీసుల్లో తెలిపింది. స్కిల్ కేసుకు సంబంధించి పార్టీ ఖాతాలోకి వచ్చిన విరాళాలకు సంబంధించిన వివరాలు కావాలంటూ సీఐడీ నోటీసుల్లో కోరింది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ అందులో భాగంగానే టిడిపి కార్యాలయానికి కూడా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. స్కిల్ నిధులు టిడిపి ఖాతాల్లోకి మళ్లించారని సీఐడీ అనుమానిస్తోంది.
వివిధ షెల్ కంపెనీల ద్వారా టిడిపి ఖాతాల్లోకి రూ.27 కోట్లు వచ్చినట్టు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇటీవల ఏసీబీ కోర్టుకు తెలిపారు. ఇప్పటికే పార్టీ కార్యాలయానికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. అయితే పార్టీకి సంబంధించి విరాళాలను అడగడాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీడీపీ హైకోర్టును ఆశ్రయించింది.
సీఐడీ అధికారులు వేధిస్తున్నారంటూ హైకోర్టులో టీడీపీ పిటిషన్ వేసింది. ప్రస్తుతం ఈ పిటిషన్ విచారణలో దశలో ఉండగానే సీఐడీ మరోసారి టీడీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ నోటీసులపై న్యాయనిపులతో సంప్రదించి ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై టీడీపీ నేతలు యోచినట్లు తెలుస్తోంది.