ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. తాము అంతరిక్షంలోకి పంపిన నిఘా ఉపగ్రహం అమెరికా అధ్యక్ష భవనాన్ని ఫొటోలు తీసిందని చెప్పారు. వైట్ హౌస్ తో పాటు పెంటగాన్, అక్కడికి దగ్గర్లోని నావల్ బేస్ ల ఫొటోలను మంచి స్పష్టతతో తీసిందని వెల్లడించారు. రోమ్ నగరం, అండర్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్, పెరల్ హార్బర్, కార్ల్ విన్సన్ ఎయిర్క్రాఫ్ట్ కేరీర్కు చెందిన ఫోటోలను కూడా కిమ్ తలకించారు.
సుప్రీం లీడర్ కిమ్ ను కోట్ చేస్తూ ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా ఈ వివరాలను వెల్లడించింది. గతవారం రికన్నైసెన్స్ ప్రోబ్ అనే నిఘా ఉపగ్రహాన్ని ఉత్తర కొరియా అంతరిక్షంలోకి పంపించింది. ఈ శాటిలైట్ విజయవంతంగా కక్షలోకి చేరిందని, ఇప్పటికే తన పని మొదలు పెట్టిందని కిమ్ వెల్లడించారు.
ఈ ఉపగ్రహంతో ఉత్తర కొరియా శత్రువులపై నిరంతరం నిఘా పెడతామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఉపగ్రహ పనితీరును పరిశీలిస్తున్నామని, డిసెంబర్ 1 నుంచి పూర్తిస్థాయిలో తన పని ప్రారంభిస్తుందని ఉత్తర కొరియా పేర్కొన్నది. శాటిలైట్ ఫైన్ ట్యూనింగ్ జరుగుతున్నట్లు ఆ దేశ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
అయితే తమ శాటిలైట్ తీసిన చిత్రాలను ఇప్పటి వరకు ఉత్తర కొరియా బయిటి ప్రపంచానికి విడుదల చేయలేదు. ఉత్తర కొరియా పంపించిన ఉపగ్రహం గురించి కానీ, దాని పనితీరు గురించి కానీ బయటి ప్రపంచానికి ఎలాంటి వివరాలు తెలియవు. వాటితో పాటు ప్రస్తుతం ఆ శాటిలైట్ తీసినట్లు చెబుతున్న ఫొటోల వివరాలపైనా ప్రపంచ దేశాలకు ఎలాంటి స్పష్టత లేదు. శాటిలైట్ వివరాలు కానీ, అది తీసిన ఫొటోలు కానీ నార్త్ కొరియా ఇప్పటి వరకు బయటపెట్టలేదు.