తెలంగాణ శాసనసభ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నిక ఏకగ్రీవమైంది. అసెంబ్లీ స్పీకర్ పదవికి బుధవారం జరిగిన నామినేషన్ల ప్రక్రియలో గడ్డం ప్రసాద్ కుమార్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. మిగతా పార్టీలేవీ తమ అభ్యర్థులను నిలపలేదు. గడ్డం ప్రసాద్ కుమార్కు కాంగ్రెస్తో పాటు బిఆర్ఎస్ కూడా మద్దతు తెలిపింది.
ఎంఐఎం సైతం తమ మద్దతును ప్రకటించింది. దాంతో శాసనసభ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నిక ఏకగ్రీవం కాగా, ఈ విషయాన్ని గురువారం శాసనసభలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ అధికారికంగా ప్రకటించనున్నారు. గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభంలో స్పీకర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
కాంగ్రెస్ తరఫున మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో వికారాబాద్ ఎంఎల్ఎ గడ్డం ప్రసాద్ కుమార్ సభాపతి పదవికి నామినేషన్ దాఖలు చేశారు. అధికార పార్టీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ప్రతిపక్షం నుంచి కెటిఆర్ గడ్డం ప్రసాద్కుమార్ను ప్రతిపాదిస్తూ నామినేషన్పై సంతకం చేశారు. నామినేషన్ కాపీని అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు.
నామినేషన్ కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, మాజీ మంత్రి కెటిఆర్, కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
కాగా, స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవానికి సహకరించాలని ఇప్పటికే రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బిఆర్ఎస్ పార్టీ అధినేత, పార్టీ శాసన సభానేత కెసిఆర్ను కోరగా, ఆయన అంగీకరించడం, మరోవైపు ఎంఐఎం నేత పార్టీ సైతం మద్దతు ఇస్తున్న నేపథ్యంలో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ ఎన్నికకు బిజెపి ఎంఎల్ఎలు మాత్రం దూరంగా ఉన్నారు. సభాపతిగా ప్రసాద్ కుమార్ తెలంగాణ రాష్ట్రానికి తొలి దళిత స్పీకర్ ఆయనే కానుండడం విశేషం.