తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ పథకానికి మహిళా ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఈ పథకం అమల్లోకి వచ్చిన 11 రోజుల్లోనే రికార్డుస్థాయిలో 3 కోట్ల మంది మహిళలు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం గమనార్హం.
ప్రతి రోజూ సగటున 30 లక్షల మంది మహిళలు రాకపోకలు సాగిస్తున్నారు. పురుషులతో కలుపుకుంటే మొత్తంగా ప్రతి రోజూ 51 లక్షల మందిని సురక్షితంగా సంస్థ గమ్యస్థానాలకు చేర్చుతోంది. ప్రయాణికుల్లో 62 శాతం మంది మహిళలే ఉంటున్నారు. మహిళల ఉచిత ప్రయాణ స్కీం ఫలితంగా సంస్థ ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్) గణనీయంగా పెరిగింది.
గతంలో 69 శాతం ఓఆర్ ఉండగా, ప్రస్తుతం అది 88 శాతానికి పెరిగింది. డిసెంబర్ 16వ తేదిన 17 డిపోలు, 17వ తేదిన 20 డిపోలు, 18వ తేదిన 45 డిపోల్లో 100 శాతానికి పైగా ఓఆర్ నమోదయింది. గత మూడు రోజుల్లో యాదగిరిగుట్ట, వేములవాడ, దుబ్బాక, గజ్వేల్-ప్రజ్ఞాపూర్, హుజురాబాద్, మేడ్చల్, ముషీరాబాద్, మియాపూర్-2, జీడిమెట్ల, కుషాయిగూడ డిపోలు 100 శాతం ఓఆర్ సాధించాయి.
రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 9 వ తేది నుంచి ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఈ స్కీంను టీఎస్ఆర్టీసీ అమలు చేస్తోంది. సమర్థవంతంగా ఈ స్కీమ్ ను అమలు చేసేందుకు డిసెంబర్ 15 నుంచి జీరో టికెట్లను మహిళలకు జారీ చేస్తోంది.
ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య అమలు తీరుపై క్షేత్రస్థాయి అధికారులతో సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ వర్చువల్గా సమావేశం నిర్వహించారు. దాదాపు 30 డిపోలకు చెందిన డ్రైవర్లు, కండక్టర్లతో స్వయంగా మాట్లాడారు. ఈ స్కీం అమలవుతున్న తీరు, వారికి తలెత్తుతున్న ఇబ్బందులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బందికి, ప్రయాణికులకు పలు సూచనలు చేశారు.
అతి తక్కువ టైంలోనే ఈ స్కీంను అర్థం చేసుకుని.. చాలా చిత్తశుద్ధితో సమర్థవంతంగా ఈ స్కీంను విజయవంతంగా అమలు చేస్తోన్న టీఎస్ఆర్టీసీ సిబ్బందిని ప్రశంసించారు. ఓపిక, సహనంతో విధులు నిర్వర్తిస్తూ మర్యాదపూర్వకంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్న సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.
జీరో టికెట్ల విషయంలో కొందరు మహిళలు నిర్లక్ష్యంగా ఉండొద్దని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా టికెట్ తీసుకోవాలని కోరారు. జీరో టికెట్ ను జారీ చేస్తేనే ఆ చార్జీని టీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం రీయంబర్స్ చేస్తుందని స్పష్టం చేశారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే రూట్ బస్సుల్లో కొందరు ప్రమాదకర రీతిలో ప్రయాణం చేస్తున్నట్లు సంస్థ దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు.
ముఖ్యంగా చివరి ట్రిప్పు బస్సుల్లో ఫుట్ బోర్డు ప్రయాణంతో పాటు వెనుక లాడర్ పైన ఎక్కి ప్రయాణిస్తున్నారని చెప్పారు. ప్రాణాలను పణంగా పెట్టి ఇలా ప్రయాణించడం సరికాదని, రద్దీ సమయాల్లో తమ సిబ్బందికి సహకరించాలని ప్రయాణికులను టీఎస్ఆర్టీసీ ఎండీ కోరారు.