గూఢచర్యం ఆరోపణలకు సంబంధించిన కేసులో ఖతార్లో మరణశిక్షను ఎదుర్కొంటున్న 8 మంది భారతీయులకు ఉపశమనం లభించింది. వారికి విధించిన మరణశిక్షలను ఖతార్ కోర్టు సవరించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ గురువారం ప్రకటించింది. అయితే వారికి ఎన్నేళ్ల శిక్ష విధించారనే దానిపై స్పష్టత రాలేదు. తీర్పునకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదని, దీనిపై ఖతర్ అధికారులతో సంప్రదిస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది.
ఖతర్ కోర్టులో ఈ తీర్పు ఇస్తున్న సమయంలో నిందితుల కుటుంబ సభ్యులతో పాటుగా ఖతర్లో మన రాయబారి కూడా ఉన్నారని విదేశాంగ శాఖ ఆ ప్రకటనలో తెలిపింది.ఈ కేసులో తదుపరి చర్యలు చేపట్టేందుకు న్యాయబృందంతోను చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది.
కాగా ఖతర్లోని ప్రైవేటు కంపెనీ దహ్రా గ్లోబల్ లో పని చేస్తున్న భారత నేవీ మాజీ కమాండర్లు పూర్ణేందు తివారీ, సుగుణాకర్ పాకాల, అమిత్ నాగ్పాల్, సంజీవ్ గుప్తా, మాజీ నేవీ కెప్టెన్లు నవతేజ్ సింగ్ గిల్, బీరేంద్ర కుమార్ వర్మ,సౌరభ్ వశిష్ట్, మాజీ సెయిలర్ రాకేశ్ గోపకుమార్లను 2022లో అరెస్టు చేశారు.
ఇజ్రాయెల్ తరఫున గూఢచర్యం చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఖతర్ కోర్టు ఈ ఏడాది అక్టోబర్లో వీరికి మరణ శిక్ష విధించింది. మరో వైపు భారత ప్రభుత్వం దీనిపై స్పందించింది. ఖతర్ ప్రభుత్వ యంత్రాంగంతో చర్చలు జరిపింది. భారత విదేశాంగ వాఖ దోహా కోర్టులో అపీలు దాఖలు చేసింది.
భారతీయ మాజీ నేవీ అధికారులకు దౌత్యసంప్రదింపులతో పాటుగా అవసరమైన న్యాయ సహాయాన్ని అందించింది. దుబాయి అలాగే ఇటీవల దుబాయిలో జరిగిన టాప్ 28 శిఖరాగ్ర సమావేశంలో ఖతర్ పాలకుడు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్థానిని ప్రధాని మోడీ కలిశారు.ఈ అంశంపై మాట్లాడారు.
ఈ నేపథ్యంలో భారత మాజీ నేవీ అధికారులకు విధించిన మరణ శిక్షఅపీల్పై ఖతర్ కోర్టు విచారణ జరిపింది.మరణ శిక్షను తగ్గించి జైలు శిక్షగా మార్పు చేసింది.
గతంలో 8 మంది భారత మాజీ నేవీ సిబ్బందికి ఖతార్లో కోర్టు మరణశిక్ష విధించింది. ఈ తీర్పు పట్ల భారత ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ తీర్పు రద్దు కోసం న్యాయపరమైన అవకాశాలను అన్వేషిస్తామని భారత ప్రభుత్వం ఇదివరకు ప్రకటించింది.
అల్ దహ్రాలోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఈ 8 మంది భారతీయులను గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై గత ఏడాది ఆగస్టులో ఖతార్ ప్రభుత్వం అరెస్టు చేసింది. అయితే వీరిపై నమోదైన ఆరోపణల గురించి ఖతార్ పాలకులు కాని, భారత ప్రభుత్వం కాని వెల్లడించలేదు.