తెలంగాణాలో కొత్తగా పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేయాలని, తద్వారా తెలంగాణ యువతకు లక్షాది ఉపాధి అవకాశాలు కల్పించవచ్చునని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ మీదుగా విజయవాడకు అనుసంధానించే జాతీయ రహదారి పొడవునా కొత్తగా ఏర్పాటు చేయబోయే పారిశ్రామిక కారిడార్కు అనుమతివ్వాలని కూడా కోరారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు శనివారం న్యూఢిల్లీలో కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కలిసి రాష్ట్రంకు సంబంధించిన పలు అంశాలపై చారఃచించారు. హైదరాబాద్- నాగ్పూర్ పారిశ్రామిక కారిడార్కు సంబంధించిన పెండింగ్లోని మిగతా అనుమతులు మంజూరు చేస్తే రాష్ట్రానికి రూ. 2,300 కోట్ల నిధులు విడుదలవుతాయని కేంద్ర మంత్రికి రేవంత్ విన్నవించారు.
అంతేగాక రాష్ట్రానికి సంబంధించిన అనేక పెండింగ్ లో ఉన్న సమస్యలపై చర్చలు జరిపి, వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని, తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలంటే కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం కావాల్సిన అవసరం ఉందని రేవంత్రెడ్డి కేంద్రమంత్రికి కూలంకషంగా వివరించారు.
హైదరాబాద్- వరంగల్లు పారిశ్రామిక కారిడార్లో ప్రాధాన్యతా అంశంగా ఫార్మాసిటీని గత ప్రభుత్వం ప్రతిపాదించిందని, దానిని ఉపసంహరించుకొని నూతన ప్రతిపాదనలు పంపించేందుకు అనుమతించాలని కూడా సీఎం రేవంత్రెడ్డి కేంద్రమంత్రిని కోరారు.
అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సివిల్ సప్లయీస్ శాఖకు రావాల్సిన రూ.4,256 కోట్ల నిధులను విడుదల చేయాలని కూడా కోరారు. ధాన్యం సేకరణ అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. వివిధ శాఖల వారీగా పెండింగ్లో ఉన్న బకాలయిలను కూడా విడుదల చేయాలని సిఎం కోరారు.
రాష్ట్ర విభజన సమయంలో అప్పటి యుపిఎ (కాంగ్రెస్) ప్రభుత్వ హయాంలో హైదరాబాద్కు నేషనల్ డిజైన్స్ సెంటర్ (ఎన్ఐడి)ను మంజూరు చేసిందని, ఆనాటి కేంద్రమంత్రి ఆనంద్ శర్మ దానికి శంకుస్థాపన కూడా చేశారని ముఖ్యమంత్రి పూర్తి వివరాలతో కేంద్రమంత్రి పీయూష్ గోయల్కు వివరించారు.
అయితే, రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్ఐడి సంస్థను విజయవాడకు తరలించారని, ఈ నేపధ్యంలో తెలంగాణకు కొత్త ఎన్ఐడిని మంజూరు చేయాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నెల్లూరు జిల్లాకు మెగా లెదర్ పార్క్ను మంజూరు చేసిందని చెబుతూ తెలంగాణకు కూడా మెగా లెదర్ పార్క్ను మంజూ రు చేయాలని అభ్యర్థించారు.
కరీంనగర్, జనగాం జిల్లాల్లో లెదర్ పార్క్ ఏర్పాటుకు అవసరమైన భూములు ఉన్నాయని వివరించారు. కేంద్రం లెదర్ పార్క్ను మంజూరు చేస్తే వెంటనే భూములు కేటాయిస్తామని కూడా కేంద్రమంత్రి పీయూష్ గోయల్కు వివరించారు. ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
అంతేగాక కేంద్ర ప్రభుత్వం పిఎం మిత్ర పథకంలో భాగంగా వరంగల్లులోని మెగా టెక్స్టైల్ పార్క్కు బ్రౌన్ఫీల్డ్ హోదా ఇచ్చిందని, దానిలో మార్పులు చేసి గ్రీన్ఫీల్డ్ హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ కేం ద్ర మంత్రిని అభ్యర్ధించారు. బ్రౌన్ఫీల్డ్ నుంచి గ్రీన్ ఫీల్డ్కు మార్చితే మెగా టెక్స్టైల్ పార్క్కు గ్రాంట్ల రూపంలో అదనంగా రూ. 300 కోట్ల నిధులు వస్తాయని, ఈ నిధులు అక్కడి పరిశ్రమలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని సిఎం అభ్యర్ధించారు.
టెక్నికల్ టెక్స్టైల్స్ (బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, కన్వేయర్ బెల్టులు, ఎయిర్ బ్యాగ్లు తదితరాలు) టెస్టింట్ సెంటర్ల ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని ము ఖ్యమంత్రి ఆయనకు గుర్తు చేశారు. ఈ విషయంలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తం చేసిందని, అందుచేతనే రాష్ట్రానికి సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ టెక్నికల్ టెక్స్టైల్స్ టెస్టింగ్ సెంటర్ను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కోరారు.
దీనికితోడు తెలంగాణ రాష్ట్రానికి జాతీయ చేనేత సాంకేతిక కేంద్రం (ఐఐహెచ్టి)ను మంజూరు చేయాలని సీఎం కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఏడు చేనేత క్లస్టర్స్ ఉన్నాయని, ఐఐహెచ్ మంజూరు చేస్తే నేత కార్మికులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ఆదాయాలు పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని సిఎం వివరించారు.
ఐఐహెచ్ ఎక్స్టెన్షన్ సెంటర్ ఏర్పాటుకు కేంద్రమంత్రి సానుకూలత వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సానుకూల దృక్ఫథంతో మాట్లాడిన తీరుకు సంతోషం వ్యక్తంచేసిన కేంద్ర మంత్రి “మీ రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తామని” హామీ ఇచ్చారు.