నందమూరి కుటుంబంలో విభేదాలు మరోమారు బయటపడ్డాయి. బాబాయ్ బాలకృష్ణ, అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ ఉన్నట్టు వస్తున్న వార్తలు నిజమేనని నిరూపించే ఘటన ఎన్టీఆర్ ఘాట్ వేదికగానే జరిగింది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద గురువారం తెల్లవారుజామున నందమూరి కుటుంబసభ్యులు నివాళి అర్పించారు.
జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్ కూడా తెల్లవారుజామునే వచ్చి తాతకు నివాళి అర్పించి వెళ్లారు. అప్పటికే అక్కడికి చేరుకున్న తారక్ అభిమానులు ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ తర్వాత కాసేపటికే కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులతో వచ్చిన బాలకృష్ణ తండ్రికి అంజలి ఘటించి వెళ్లారు.
అక్కడి వరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. బాలయ్య వెళ్లిపోయిన తర్వాత ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన తారక్ ఫ్లెక్సీలను తొలగించడం వివాదానికి దారితీసింది. బాలకృష్ణ ఆదేశించడంతోనే వాటిని తొలగించారన్న ప్రచారం మొదలు కావడమే కాదు, వాటిని తొలగించాలని బాలయ్య చెప్తున్నట్టుగా ఉన్న వీడియో కూడా బయటకు వచ్చి వైరల్ అయింది.
ఇది చూసిన తారక్ అభిమానులు బాలయ్యపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే కొడాలి నాని గుడివాడలో మాట్లాడుతూ.. వెయ్యిమంది చంద్రబాబులు, బాలకృష్ణలు వచ్చినా తారక్ను ఏమీ చేయలేరని తేల్చి చెప్పారు.