ఈ ఏడాది దేశంలో ఎండలు మరింతగా మండుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించింది. ఈ వేసవి కాలమంతా కూడా ఎల్నినో పరిస్థితులు కొనసాగే అవకాశం వుందని, వేడిమి భరించలేని స్థాయిలో ఉండొచ్చని ఐఎండి తెలిపింది. సాధారణంగా ఊహించిన దానికన్నా ఈశాన్య భారతంలో, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటక ప్రాంతాల్లో, మహారాష్ట్ర, ఒడిశాల్లో పలుచోట్ల వడగాడ్పులు ప్రచండంగా ఉండొచ్చని పేర్కొంది.
మార్చిలో సాధారణం కన్నా అధికంగా (సుదీర్ఘ కాల సగటు 29.9 మిలీమీటర్ల కన్నా 117శాతం ఎక్కువ) వర్షపాతం వుండొచ్చని, మార్చి – మే మధ్య దేశంలో చాలా ప్రాంతాల్లో సాధారణం కన్నా గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం వుందని ఐఎండి డైరెక్టర్ జనరల్ మృత్యుంజరు మహాపాత్రో మీడియాకు తెలిపారు.
ఎల్నినో పరిస్థితులు ఈ వేసవి అంతా కొనసాగే అవకాశముందని అన్నారు. వర్షాకాలం రెండో అర్ధభాగంలో ‘లా నినా’ నెలకొనే అవకాశమున్నందున వర్షాలు బాగా కురియవచ్చని ఐఎండి తెలిపింది.