తెలంగాణలో ఎండల తీవ్రత దడ పుట్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి నెల చివర నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళలో వాతావరణం చల్లగా ఉన్నా పగటిపూట మాత్రం సూర్యుడు విజృంభిస్తున్నాడు. నిప్పులు చెరిగే ఎండలతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. వారం రోజులుగా హైదరాబాద్ తోపాటు పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఈ క్రమంలో రానున్న 5 రోజులు తెలంగాణ వ్యాప్తంగా ఎండలు తీవ్రంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం నుంచి గురువారం వరకు ఐదు రోజుల పాటు ఎండల తవ్రత రికార్డు స్ధాయిలో నమోదు కానున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
ఈ 5 రోజులు 37 డిగ్రీల సెల్సీయస్ నుంచి 40 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి వేళల్లోనూ సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని పేర్కొంది. ఇక, హైదరాబాద్లోనూ ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి.
రాష్ట్రంలోని సగం జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ను దాటుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో నగర వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటనే భయపడిపోతున్నారు.
సిద్దిపేట, ములుగు, వనపర్తి జిల్లాల్లో అత్యధికంగా 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్, ఖమ్మం జిల్లా మధిర, జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రం, నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి, ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో 38.9 డిగ్రీలు, భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలంలో 38.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఎండల తీవ్రత పెరుగనున్న క్రమంలో జనాలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. మార్చి మొదటి వారంలో వేడి విపరీతంగా పెరిగింది. రాష్ట్రం లోని సగం జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ను దాటుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.