ఐదేళ్లలో ఏపీ పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి సరిదిద్ద లేనంత నష్టం జరిగిందని పేర్కొంటూ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని బాగు చేస్తుందని భరోసా ఇచ్చారు. రెండు రోజుల పాటు డిల్లీ పర్యటన లో ఉన్న ఆయన ప్రదానితో సహా పలువురు కేంద్ర మంత్రులను కలసి ఎపికి చేయూత ఇవ్వవలసిందిగా కోరారు.
ఇక పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు బయలుదేరుతున్న సమయంలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఏపీ గ్లోబల్ లీడర్ గా తయారు చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. దక్షిణాదిలో ఏ రాష్ట్రానికి లేనన్ని గొప్ప వనరులు ఏపీకి ఉన్నాయి.. కృష్ణా గోదావరి నదులు రాష్ట్రం గుండా వెళ్తున్నాయి.. ఒక్క గోదావరి నది నుంచి 3 వేల టీఎంసీల నీరు సముద్రం పాలు అవుతుంది.. ఆ నీటిని వినియోగించుకుంటే దక్షిణాది మొత్తానికి నీటిని ఇవ్వొచ్చని ఆయన తెలిపారు.
కేంద్రం నుంచి ఎలాంటి పదవులు ఆశించలేదు.. పదవుల కోసం డిమాండ్ చేయలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. వాజ్ పేయి హయాంలో 7 మంత్రి పదవులు ఇస్తామన్న తీసుకోలేదని, ఒక్క స్పీకర్ మాత్రమే తీసుకున్నామని గుర్తు చేశారు. ఈ సారి డిప్యూటీ స్పీకర్ పదవి అడగలేదని, వాళ్ళు ఇస్తామనలేదని తెలిపారు. తమకిచ్చిన మంత్రి పదవుల పట్ల తాము సంతోషంగా ఉన్నామని పేర్కొన్నారు.
మరోవైపు.. ఐదేళ్ల జగన్ పాలన వల్ల అమరావతి ప్రాముఖ్యత తగ్గింది.. అమరావతికి ప్రాముఖ్యత తీసుకు వచ్చేలా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఐదేళ్లలో ప్రభుత్వ పరంగా కావాల్సిన మౌలిక వసతుల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. దశల వారిగా నిర్మాణాలు పూర్తి చేస్తామని వివరించారు.
