రాజధాని బీరుట్తోసహా లెబనాన్ వ్యాప్తంగా, సిరియాలో కొన్నిచోట్ల మంగళవారం చోటుచేసుకున్న పేజర్ పేలుళ్లలో 9 మంది మరణించగా, దాదాపు 2750మంది గాయపడ్డారు. వీరిలో ఇరాన్ రాయబారి, హిజ్బుల్లా ఎంపి కుమారుడు, ఒక బాలిక కూడా వున్నారు. తండ్రి పక్కనే వుండడంతో పేజర్ పేలుడులో ఆ బాలిక మరణించిందని బంధువులు తెలిపారు.
గాయపడిన వారిలో 200మంది పరిస్థితి విషమంగా వుంది. ఈ పేలుళ్లకు ఇజ్రాయిల్ కారణమని, ఇందుకు బాధ్యులైనవారు శిక్ష అనుభవించక తప్పదని హిజ్బుల్లా హెచ్చరించింది. ఈ పేలుళ్లలో తమ సభ్యులు ఇద్దరు మరణించారని అంతకుముందు హిజ్బుల్లా ధ్రువీకరించింది. పేలుళ్ళకు కారకులైన వారిని నిర్ధారించేందుకు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపింది.
ఇటీవలి మాసాల్లో హిజ్బుల్లా అత్యంత ఆధునాతనమైన మోడల్ పేజర్లని తీసుకువచ్చిందని భద్రతా వర్గాలు తెలిపాయి. సమాచారాన్ని పంపుకునేందుకు వీటిని వాడతారు. లెబనాన్వ్యాప్తంగా ఆ పేజర్లు పలుచోట్ల పేలిపోయాయి. హిజ్బుల్లా సభ్యుల వద్ద వున్న పేజర్లను పేల్చివేసినట్లు తెలుస్తోందని పేరు వెల్లడించని భద్రతా అధికారులు తెలిపారు.
ఇది ఇజ్రాయిల్ దాడే అని మరో అధికారి అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ పేలుళ్లలో లెబనాన్లో ఇరాన్ రాయబారి అమాని కూడా గాయపడ్డారని, ప్రస్తుతం ఆయనను ఆస్పత్రిలో అబ్జర్వేషన్లో వుంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పేవ్మెంట్లపై ఎక్కడికక్కడ వ్యక్తులు పడిపోయి వుండడం కనిపిస్తోంది.
చేతులకు, పొట్టలకు, పేజర్లు పెట్టుకున్న ప్యాంట్ జేబుల వద్ద ఎక్కువగా గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సెల్ఫోన్లు వెంట తీసుకువెళ్ళవద్దని అంతకుముందు హిజ్బుల్లా నేత హసన్ నస్రుల్లా సభ్యులను హెచ్చరించారు.
ఈ ఫోన్లు వెంట వుంటే కదలికలను ట్రాక్ చేస్తారని, దాడులు చేస్తారని హెచ్చరించారు. దాంతో పేజర్లను వాడాలని సభ్యులకు సూచించారు. ఇజ్రాయిల్తో ఉద్రిక్తతలు పెచ్చరిల్లిన వేళ హిజ్బుల్లా పాత కాలపు పద్దతులను ఉపయోగిస్తోంది. శత్రువు ఆధునిక నిఘా పద్దతులకు దొరక్కుండా వుండేలా కోడ్ సందేశాలు, ల్యాండ్లైన్ ఫోన్లు వాడుతోంది. అందులో భాగమే ఈ పేజర్లు కూడా.
పేజర్ అంటే ఓ చిన్న పోర్టబుల్ ఎలక్ట్రానిక్ పరికరం. సందేశాలు పంపుకోడానికి, స్వీకరించడానికి దీనిని ఉపయోగిస్తారు. రేడియో ఫ్రీక్వెన్సీస్ ద్వారా సంక్షిప్తంగా సమాచారాన్ని కమ్యూనికేట్ చేసుకోడానికి వినియోగిస్తారు.