శ్రీలంక నూతన అధ్యక్షుడిగా అనుర కుమార దిసనాయకే ఎన్నికయ్యారు. ఈ మేరకు శ్రీలంక ఎన్నికల సంఘం ఆదివారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. రణిల్ విక్రమ సింఘేను దిసనాయకే ఓడించారు. అనుర కుమార దిసనాయకే(56), సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి శ్రీలంక రెండో అధ్యక్షుడు అయ్యారు. ఆయన తండ్రి వ్యవసాయ కూలీ.
శనివారం జరిగిన ఎన్నికలలో 55 ఏళ్ల దిసనాయకే 42.31 శాతం ఓట్లతో అధ్యక్షుడిగా గెలిచారని ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో వెల్లడించింది. దిసనాయకే.. ప్రతిపక్షనాయకుడు సజిత్ ప్రేమదాసును రెండవ స్థానానికి, విక్రమ సింఘేను మూడవ స్థానానికి నెట్టేశారు. అనుర కుమార దిసనాయకే సోమవారం శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తొలుత విజయానికి అవసరమైన 50 శాతానికిపైగా ఓట్లు ఏ అభ్యర్థికీ రాలేదు. దీంతో గెలుపును నిర్ధరించే రెండో రౌండ్ కౌంటింగ్ చేపట్టారు. ఇందులో మార్కిస్ట్ నేత కుమార దిసనాయకే విజయం సాధించారు. ‘పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ 55 ఏళ్ల నాయకుడు అనుర కుమార డిస్సనాయకే శనివారం జరిగిన ఎన్నికలలో 42.31% ఓట్లతో అధ్యక్ష పదవిని గెలుచుకున్నారు’ అని ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించింది.
ఇక, ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస 32.76%తో రెండో స్థానంలో నిలిచారు. 2022 ఆర్థిక పతనం గరిష్ట సమయంలో పదవీ బాధ్యతలు స్వీకరించిన, ఐఎంఎఫ్ బెయిలవుట్ నిబంధనల ప్రకారం కఠినమైన పొదుపు విధానాలను విధించిన పదవీ విరమణ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే.. 17.27%తో మూడవ స్థానంలో నిలిచారు. ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే తొలి రౌండులోనే పోటీ నుంచి వైదొలిగారు.
కాగా, శ్రీలంకలో రాజకీయంగా ప్రాబల్యం ఉన్న రాజపక్స కుటుంబంపై ప్రజలు పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయారు. గత 20 ఏళ్లుగా పార్లమెంట్లో ఉన్న దిసనాయకేపై శ్రీలంక ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన దిసనాయకే తన విజయం తర్వాత జాతీయ ఐక్యత కోసం పిలుపునిచ్చారు. సింహళీయులు, తమిళులు, ముస్లింలు, శ్రీలంక ప్రజలందరి ఐక్యతకు ఇది కొత్త ప్రారంభమని వ్యాఖ్యానించారు.