గోదావరి నదిలో నీటి లభ్యతపై సాంకేతిక పరంగా సమగ్ర అధ్యయనం జరిపించి నీటివాటాలు తేల్చేందుకు కొత్తగా ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని తెలుగు రాష్ట్రాలు గోదావరి నదీయాజమాన్య బోర్డును డిమాండ్ చేశాయి. బుధవారం నాడు జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం చైర్మన్ మహేంద్ర ప్రతాప్ సింగ్ అధ్యక్షతన జరిగింది.
అయితే, ఈ అంశాలు బోర్డు పరిధిలో లేవని చైర్మన్ తేల్చి చెప్పారు. మరోవంక వివాదాస్పద అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు ఎవ్వరి వాదనలు వారు వినిపించడంతో ఏకాభిప్రాయం కుదరలేదు. పెండింగ్ ప్రాజెక్ట్ లకు తాము డిపిఆర్ సమర్పించామని, వీటిపై ఏపీ అభ్యంతరాలను చైర్మన్ తిరస్కరించారని తెలంగాణ ప్రతినిధి చెప్పగా, అసలు నీటి కేటాయింపులు లేని ప్రాజెక్ట్ లకు డిపిఆర్ లు ఏమిటని ఏపీ ప్రశ్నించింది.
సమావేశం అనంతరం తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరి రజత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం గోదావరి నదీజలాలను ఇతర బేసిన్లకు మళ్లిస్తే అప్పర్ రైపేరియన్ రైట్స్ ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి 45 టిఎంసిలు రావాలని బోర్డుకు తెలిపామని పేర్కొన్నారు.
కర్నాటక , మహారాష్ట్రలకు దక్కే 35టిఎంసిలకు ఇప్పటికే ఆ రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టి నీటిని వినియోగించుకుంటున్నట్టు బోర్డు దృష్టికి తీసుకుపోయినట్టు తెలిపారు. నదిలో నీటిలభ్యతపై అధ్యయనం జరపాలని, నీటి పంపిణీకి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని చెప్పారు.
గోదావరి నదిపై తెలంగాణలో నిర్మిస్తున్న చనాకాకొరాటా, చిన్నకాళేళ్వరం , చౌటుపల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల సాగునీటి పధకాల డిపిఆర్లను సమర్పించామని తెలిపారు. బోర్డు చైర్మన్ రెండు రాష్ట్రాల అభిప్రాయాలు తెలపమని కోరగా ఎపి ప్రభుత్వం ఈ మూడు ప్రాజెక్టుల డిపిఆర్లను వ్యతిరేకించింది.
వాటికి సిడబ్యుసితోపాటు హైడ్రాలజికి చెందిన అన్ని క్లియరెన్సులు ఉన్నట్టు బోర్డు దృష్టికి తీసుకుపోయామని, ఈ మూడు డిపిఆర్లపై ఎపికి ఇప్పటికే చాలా సార్లు వివరణ ఇచ్చామని, మళీ జాప్యం జరగకుండా ఇక ఎపి ప్రభుత్వ అభ్యంతరాలను పట్టించుకోవద్దని బోర్డును తెలంగాణ కోరింది.
బోర్డు చైర్మన్ కూడా ఏపి ప్రభుత్వ అభ్యంతరాలను తిరస్కరించినట్టు వారు తెలిపారు. రెండు రాష్టాల అభిప్రాయాలను రికార్డు చేసి సిడబ్యుసికి పంపేందుకు చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. గోదావరినదిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులన్నీ పాత పథకాలనే అని రజత్ కుమార్ స్పష్టం చేశారు. గోదావరి నదిలో నీటి లభ్యతపై సమగ్ర అధ్యయనం జరపాలని, నీటి కేటాయింపులకోసం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని బోర్డును డిమాండ్ చేశారు.
కాగా, గోదావరి నదిలో నీటివాటాలు తేల్చేందుకు ట్రిబ్యునల్ వేయాలని, అదే విధంగా నదిలో నీటిలభ్యతపై సమగ్ర అధ్యయనం చేయించాలని బోర్డును కోరగా ఈ రెండు అంశాలు తమపరిధిలో లేవని బోర్డు చైర్మన్ వెల్లడించారని ఏపి నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషన్ కుమార్ మీడియాకు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న చనాకాకొరాటా, చౌటుపల్లి హన్మంతరెడ్డి, చిన్నకాళేశ్వరం ఎత్తిపోతల పథకాలకు ట్రిబ్యునల్ నీటికేటాయింపులు చేయలేదని పేర్కొన్నారు.
అందువల్ల ఆ ప్రాజెక్టుల డిపిఆర్లకు బోర్డు ముందు అభ్యంతరాలు తెలిపామని చెప్పారు. అశాస్త్రీయంగా సిడబ్యుసి ఈ ప్రాజెక్టుల డిపిఆర్కు ఎలా అనుమతి ఇస్తుందని ప్రశ్నించారు. ఈ ఎత్తిపోతల పథకాల వల్ల దిగువన ఉన్న ప్రాజెక్టులకు నీటి లభ్యత తగ్గిపోందని బోర్డు చైర్మన్కు తెలిపామని చెప్పారు.