తెలంగాణాలో పలు రహదారులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయడానికి వచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన ప్రసంగంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాకరంగా చేబట్టిన కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్ట్ ను ప్రశంసించడం తెలంగాణ బిజెపి నేతలలో కాక పుట్టిస్తున్నది.
నిత్యం రాష్ట్రంలోని బిజెపి నేతలు ఆ ప్రాజెక్ట్ ను కేవలం ముడుపుల కోసం చేబట్టారని దుమ్మెత్తి పోస్తుంటే తానే కేంద్రంలో జలవనరుల మంత్రిగా ఉన్నప్పుడు అనుమతి ఇచ్చానని గడ్కరీ చెప్పడం మింగుడు పడడం లేదు.
పైగా, ప్రస్తుతం ప్రజా సంగ్రామ యాత్రలో ఉన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆ ప్రాజెక్ట్ ద్వారా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేసీఆర్ ఫార్మ్ హౌస్ కు నీళ్లు ఇప్పించుకోవడం మినహా తెలంగాణ ప్రజలకు అదనంగా ఒక ఎకరాకు కూడా సాగు వసతి కల్పించలేదని ధ్వజమెత్తుతున్నారు.
అయితే, తెలంగాణలో కా ళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలు కనిపిస్తున్నాయని చెబుతూ ఈ ప్రాజెక్టు నిర్మాణంతో హైదరాబాద్ ప్రజలకు తాగునీటి సమస్య తీరిందని గడ్కరీ చెప్పడం గమనార్హం. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై గడ్కరీ పొగడ్తలతో బీజేపీలో రచ్చ మొదలయింది.
గడ్కరీ ప్రసంగాన్ని ఎవరు సిద్ధం చేశారంటూ బిజెపి నాయకులు ఆరాతీస్తున్నారు. రాష్ట్రంలో బాగా వెనుకబడిన మహబూబ్ నగర్ ప్రాంతంలో ప్రారంభమైన ప్రాజెక్ట్ లను వదిలిపెట్టి, తన ఫార్మ్ హౌస్ కోసమే కేసీఆర్ కాళేశ్వరంకు భారీగా డబ్బు ఖర్చు పెట్టారని, ఆ నిధులు కేసీఆర్ కుటుంభంకు ఏటీఎంగా మారాయని రాష్ట్ర బిజెపి నేతలు విమర్శలు చేస్తున్నారు.
నిత్యం కేసీఆర్ ను తిడుతూ, పరిపాలనకు గాలికి వదిలివేశారని అంటూ మండి పడుతూ ఉంటె వరుసగా రాష్ట్ర పర్యటనకు వస్తున్న కేంద్ర మంత్రులు కేసీఆర్ పాలనను పొగడ్తలతో ముంచెత్తుతూ ఉండడం రాష్ట్రంలోని బిజెపి నాయకులకు ఇరకాట పరిస్థితులు సృష్టిస్తున్నది.
ఈ విషయమై పలు సార్లు కేంద్ర నాయకత్వం వద్ద ప్రస్తావించినప్పటికీ మార్పు ఉండడం లేదని వాపోతున్నారు. “మీరు మమ్ములను తుడుతున్నారు. మీ కేంద్ర మంత్రులు పొగుడుతున్నారు” అంటూ తెలంగాణ మంత్రులు పలు సందర్భాలలో రాష్ట్ర బిజెపి నాయకులను ఎద్దేవా కూడా చేస్తున్నారు.