ఒక వంక ప్రస్తుతం జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఈ సారి తమిళనాడు నుండి ఎన్నిక కావాలని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి పి చిదంబరం ప్రయత్నిస్తున్న సమయంలో ఆయనతో పాటు, ఆయన తనయుడు, లోక్సభ సభ్యుడు కార్తీల చిదంబరంల ఇల్లు, కార్యాలయాలపై మంగళవారం సిబిఐ సోదాలు జరపడం చర్చనీయాంశమైంది.
ఇప్పటికే వీరిపై పలుసార్లు సిబిఐ సోదాలు జరిగాయి. అయినా నిర్దుష్టంగా వారు తమపై ఎటువంటి నేరారోపణ చేయలేక పోయారని వారు చెబుతున్నారు. గత పర్యాయం మహారాష్ట్ర నుండి రాజ్యసభకు ఎన్నికైన చిదంబరం ఈ పర్యాయం రాష్ట్రం నుండి డీఎంకే మద్దతుతో సొంత రాష్ట్రం నుండి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం రాజ్యసభ ఎన్నికలలో పోటీ చేయకుండా చేయడం కోసమే ఈ సోదాలు జరిపారని విమర్శలు చెలరేగుతున్నాయి.
చెన్నై, ముంబాయి, ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్ తదితర పదిచోట్ల వారి నివాసా లు, కార్యాలయాలపై ఏక కాలంలో సోదాలు చేపట్టింది. మొత్తం వంద మందికిపైగా సీబీఐ అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నట్లు సమాచారం. చిదంబరం నివాసంలో ఉన్న పనిమనుషులను కూడా విచారించారు. సోదాల సందర్భంగా కాంగ్రెస్ వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందన్న అనుమానంతో సీబీఐ అధికారులు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
చిదంబరం తనయుడు కార్తీపై దాఖలైన కొత్త అవినీతి కేసు విచారణలో భాగంగా సోదాలు చేసినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. యూపీఏ ప్రభుత్వ హయాంలో పి.చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తనయుడు కార్తీ చిదంబరం తండ్రి పలుకుబడిని ఉపయోగించి అక్రమంగా నగదు బట్వాడాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి.
వీటిలో ముఖ్యంగా ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు మారిషష్ నుంచి విదేశీ మారకద్రవ్యాన్ని సమకూర్చడంలో కార్తీ కీలకపాత్ర పోషించినట్లు సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ విభాగం (ఈడీ) ఆరోపించాయి. మహిళా పారిశ్రామికవేత్త ఇంద్రాణి ముఖర్జీ నిర్వహణలోని ఐఎన్ఎక్స్ మీడియా ద్వారా సంస్థ 2007లో విదేశాల నుంచి సుమారు రూ.305 కోట్ల మేర విదేశీ మారకద్రవ్యాలు బట్వాడా అయ్యాయి.
ఈ వ్యవహారంలో విదేశీ మారక నిబంధనలు ఉల్లఘించారని, పలు అక్రమాలు జరిగాయని ఆరోపణలున్నాయి. ఆదాయపు పన్నుల శాఖ జరిపిన దర్యాప్తులో ఈ అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. ఆ ఆరోపణలుకు ప్రాథమిక ఆధారాలున్నాయని సీబీఐ, ఈడీ అధికారులు ప్రకటించారు.
దీంతో కార్తీ చిదంబరంపై కేసు నమోదు చేసి 2018లో ఆయనను అరెస్టు చేశారు. అదే సమయంలో చిదంబరాన్ని 2019లో అరెస్టు చేశారు. విచారణ పూర్తయిన తర్వాత న్యాయస్థానం వారిద్దరినీ విడుదల చేసింది. అయినా కార్తీపై అవినీతి కేసుపై విచారణ కొనసాగుతోంది.
ఆ నేపథ్యంలో చిదంబరం, కార్తీ నివాసాలు, కార్యాలయాల్లో నాలుగుసార్లు సీబీఐ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా కార్తీ చిదంబరం మరిన్ని అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. ఆ దిశగా గత కొద్ది నెలలుగా రహస్యంగా విచారణ జరిపారు.
ఈ నేపథ్యంలో కార్తీపై సీబీఐ అధికారులు కొత్త కేసు నమోదు చేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు చేపట్టిన చైనా సంస్థ ఆ దేశం నుంచి కార్మికులను తరలించేందుకు ఇబ్బంది పడింది.
ఆ సమయంలో విద్యుత్ కేంద్రం పనుల కోసం చైనా నుంచి 250 మంది కార్మికులను పంజాబ్కు తరలించేందుకు కార్తీ అప్పట్లో కేంద్రమంత్రిగా ఉన్న తన తండ్రి అధికారాన్ని ప్రయోగించి వారికి అక్రమంగా వీసాలు మంజూరు చేయించినట్లు సీబీఐ తాజాగా కేసు నమోదు చేసింది.
ఈ వీసాల మంజూరుకు కార్తీ రూ.50లక్షలు ముడుపులుగా స్వీకరించినట్లు సీబీఐ ఆరోపించింది. ఈ కేసు విచారణలో భాగంగానే మంగళవారం ఉదయం ఈ సోదాలు నిర్వహించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో 2018 ఫిబ్రవరిలో కార్తీ చిదంబరం అరెస్టయ్యారు. ఆ కేసు విచారణ సమయంలో కార్తీ లండన్లో ఉన్నారు.
అక్కడి నుంచి తిరిగొచ్చిన కార్తీని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఇప్పుడు కూడా ఆయన లండన్లో వున్న సమయంలోనే సీబీఐ కేసు నమోదు చేయడం గమనార్హం. కాగా, తమ నివాసాల్లో చేపట్టిన సీబీఐ తనిఖీల్లో పత్రాలేవీ లభించలేదని చిదంబరం ట్విట్టర్లో పేర్కొన్నారు.
చెన్నైలోని తన నివాసంలో, ఢిల్లీలోని తన కార్యాలయంతో కూడిన నివాసంలోను సీబీఐ అధికారులు తనిఖీలు చేశారని, ఉదయం నుంచి జరుగుతున్న ఈ తనిఖీల్లో వారికి ఏమీ లభించలేదని తెలిపారు. అదే విధంగా తనిఖీల సందర్భంగా సీబీఐ అధికారులు తనకు చూపిన ప్రాథమిక దర్యాప్తు నివేదిక (ఎఫ్ఐఆర్)లో తనను నిందితుడిగా పేర్కొనలేదని స్పష్టం చేశారు.
ఏది ఏమైనప్పటికీ సీబీఐ తనిఖీలు జరుగుతున్న ఈ తరుణం చాలా ఆసక్తికరమైనదని చిదంబరం వ్యాఖ్యానించారు. ఇదిలా వుండగా సీబీఐ అధికారులు తనిఖీలు చేయడంపై కార్తీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నిసార్లు తనిఖీలు చేస్తారని ట్విట్టర్లో ప్రశ్నించారు. 2015లో రెండు సార్లు, 2017లో ఒకసారి, 2018లో రెండుసార్లు చొప్పున మొత్తం ఐదుసార్లు సీబీఐ అధికారులు ఇప్పటి వరకు తనిఖీ చేశారని, ప్రస్తుతం ఆరోసారి తనిఖీలు నిర్వహించారని ట్విట్టర్లో పేర్కొన్నారు.
డీఎంకే కూటమి నుంచి కాంగ్రెస్ కు దక్కిన ఏకైక రాజ్యసభ స్థానాన్ని దక్కించుకునేందుకు చిదంబరం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటొకిక పదవేనని ఇటీవల కాంగ్రెస్ తీర్మానం చేసినప్పటికీ ఆ నిబంధన చిదంబరానికి మినహాయింపునిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దాంతో రాష్ట్రం నుంచి చిదంబరం రాజ్యసభకు వెళ్లడం ఖాయమని అన్ని వర్గాలు భావించాయి. ఈ నేపథ్యంలో చిదంబరం, ఆయన తనయుడు కార్తీల నివాసాల్లో సీబీఐ సోదాలు నిర్వహించడంతో వారి అభిమానులు నివ్వెరపోతున్నారు. ఈ వ్యవహారం కాంగ్రెస్ లో ఉత్కంఠ రేపుతోంది.
కార్తీ చిదంబరం సన్నిహితుడి అరెస్ట్
ఇలా ఉండగా, వీసా కుంభకోణం కేసులో కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం సన్నిహితుడిని సీబీఐ బుధవారం అరెస్టు చేసింది. సమగ్ర విచారణ అనంతరం ఎస్ భాస్కర్ రామన్ను అధికారికంగా అరెస్టు చేసినట్లు సీబీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
కార్తీ పి చిదంబరం, ఎస్ భాస్కరరామన్, వికాస్ మఖారియా, మాన్సా (పంజాబ్) ఆధారిత ప్రైవేట్ కంపెనీ, ఎంఎస్ తల్వాండి సబో పవర్ లిమిటెడ్ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిపై సీబీఐ కేసు నమోదు చేసింది. మాన్సా వద్ద ఉన్న ప్రైవేట్ కంపెనీ థర్మల్ పవర్ ప్లాంట్ను స్థాపించే ప్రక్రియలో ఉందని, ప్లాంట్ స్థాపనను చైనా కంపెనీకి అవుట్సోర్స్ చేసిందని ఆరోపణలు వచ్చాయి.