ఆకాశంలో చాలా అరుదుగా విష్క్రతమయ్యే నవగ్రహాలలోని ఐదు గ్రహాలు ఒకే వరుసలో కన్పించే అరుదైన దృశ్యం చూసే అవకాశం వస్తోంది. ఈ నెలలోనే ఈ ఖగోళ విన్యాసం కనువిందు చేయనుంది. ఆయా గ్రహాలు వాటి కక్ష్యల్లోనే తిరుగుతున్నప్పటికీ ఒకే వరుసలో ఉన్నట్లు కన్పించడమే ఈ అద్భుతం.
బుధుడు, శుక్రుడు, అంగారకుడు, గురు, శని గ్రహాలు ఒకే వరుసలో ఉన్నట్లు కనిపిస్తాయి. వీటిని ఏ బైనాక్యులర్ లేదా టెలిస్కోప్ సహాయం లేకుండా నేరుగా చూడొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తెల్లవారడానికి కొద్ది గంటల ముందు ఈ అద్భుతాన్ని చూడొచ్చు.
సాధారణంగా మూడు గ్రహాలు ఒకే వరుసలో వస్తూంటాయి. అలా జరగడాన్ని గ్రహాల సంయోగంగా పిలుస్తారు. కానీ ఇలా ఐదు ప్రధాన గ్రహాలు ఒకే వరుసలో ఉన్నట్లు కనిపించడం చాలా అరుదు. 2004లో ఇలా ఐదు గ్రహాలు ఒకే సరళరేఖలో ఉన్నట్లు కన్పించాయి. అయితే ఈ అద్భుతమైన దృశ్యాన్ని సూర్యుడు ఉదయించకముందే చూడాల్సి ఉంటుంది.
ఎందుకంటే, సూర్యుడికి అతి దగ్గరగా బుధగ్రహం ఉంటుంది. సూర్యుడు ఉదయిస్తే ఆ కాంతి ముందు బుధగ్రహం కన్పించదు. అందువల్ల బుధగ్రహంతో పాటు ఐదు గ్రహాలను చూడాలంటే తెల్లవారుఝామునే తూర్పువైపున, ఎత్తయిన ప్రాంతంపై నిల్చుని చూడాల్సి ఉంటుంది.
ఈనెల 3-4 తేదీల నుంచి 24వ తేదీ వరకు ఈ అద్భుతాన్ని వీక్షించొచ్చు. కొన్ని రోజుల్లో ఆ గ్రహాలు మిరుమిట్లు గొలుపుతూ మరింత కాంతివంతంగా కన్పిస్తాయి కూడా. ప్రత్యేకించి 24న ఇదో అద్భుత దృశ్యమే. ప్రతిసారి దాదాపు ఒక గంట సేపు ఇలా గ్రహాలు ఒకే వరుసలో ఉన్నట్లు కనిపిస్తాయి.
ఇక్కడ మరో విశేషం కూడా కనిపిస్తుంది. ఈ ఐదు గ్రహాల్లో శుక్ర, అంగారక గ్రహాల మధ్య మన చందమామ నెలవంక రూపంలో అతిథిలా మిలమిల మెరుస్తూంటాడు. ఎడిన్బరో యూనివర్శిటీ ఖగోళశాస్త్ర విభాగానికి చెదిన ఉన్నతాధికారి ప్రొ. బెత్ బిల్లర్ ఈ వివరాలను వెల్లడించారు.