జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతామని పేర్కొంటూ, రాష్ట్రపతి ఎన్నికలలో ఉమ్మడి అభ్యర్థి ఎంపిక గురించి కొద్దీ రోజులపాటు హడావుడి చేసిన టిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈ విషయమై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంకు హాజరు కారాదని నిర్ణయించింది.
రాష్ట్రపతి ఎన్నికల వేళ … అభ్యర్థి ఎంపికపై నేడు న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో సమావేశం కావడానికి పలువురు విపక్షాల ముఖ్యమంత్రులు, పలు పార్టీలకు ఆహ్వానం అందింది. వీరిలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సహా దేశంలోని 8 మంది ముఖ్యమంత్రులు, 22 మంది వివిధ పార్టీల నేతలకు సిఎం మమతా బెనర్జీ లేఖ రాశారు.
సిఎం మమతా బెనర్జీ ఆహ్వానంపై ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగతిభవన్లో సీనియర్ నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ పార్టీని ఆ సమావేశానికి ఆహ్వానించడంపై టిఆర్ఎస్ అసంతఅప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రపతి ఎన్నికల్లో తమవైఖరిని తర్వాత ప్రకటిస్తామని వెల్లడించింది.
బిజెపి, కాంగ్రెస్కు సమదూరం పాటించాలని అభిప్రాయం వ్యక్తం చేసింది. పార్టీ తరఫున ప్రతినిధులు ఎవరూ మమతా సమావేశానికి హాజరుకాకూడదని సిఎం కెసిఆర్ నిర్ణయించారు.టిఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకోవడానికి నాలుగు ప్రధాన కారణాలున్నట్లు ఆ పార్టీ వర్గాలు వివరించయాయి.
జాతీయ పార్టీలుగా పేర్కొంటున్న కాంగ్రెస్, బిజెపిలు రెండింటికి సమానదూరంలో ఉంటాయని స్పష్టం చేసింది. ఢిల్లీలో సమావేశం నిర్వహిస్తున్న పార్టీ ముఖ్యనేతలకు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఈ సమావేశానికి కాంగ్రెస్ను ఆహ్వానించడంపై టిఆర్ఎస్ తీవ్ర అసంతృప్తికి గురైనట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
కాంగ్రెస్ విషయంలో తమకున్న అభ్యంతరాలు చెప్పినప్పటికీ కూడా ఆ పార్టీని ఆహ్వానించడం సరికాదనిప టిఆర్ఎస్ గట్టిగా అభిప్రాయపడుతున్నది. తెలంగాణలో టిఆర్ఎస్కు ప్రధాన పోటీదారైన కాంగ్రెస్తో ఏ స్థాయిలోనూ వేదిక పంచుకునే అవకాశం ఉండనే ఉండదని టిఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
మొన్నటికి మొన్న కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్గాంధీ తెలంగాణకు వచ్చి బిజెపిని పల్లెత్తు మాట అనకపోగా టిఆర్ఎస్ ప్రభుత్వంపై అవాస్తవాలు ప్రచారం చేసి వెళ్లారని, అందువల్ల అలాంటి పార్టీతో కలిసి కూర్చొని చర్చించే ప్రశ్నే ఉత్పన్నం కాదని టిఆర్ఎస్ ముఖ్య నేతలు వివరించారు.
తెలంగాణలో కాంగ్రెస్ బిజెపితో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నదని, గత లోక్సభ ఎన్నికలు మొదలుకొని మొన్నటి హుజూరాబాద్ ఎన్నికల దాకా తనను తాను పణంగా పెట్టుకొని డిపాజిట్లు కోల్పోయి బిజెపిని గెలిపించే ప్రయత్నం చేస్తున్నదని, అందువల్ల అటువంటి కాంగ్రెస్ను నమ్మే సందర్భమే రాదని టిఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేశాయి.
అయినా విపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయడం కోసం ఈ సమావేశం నిర్వహణ పద్ధతే సరిగా లేదని టిఆర్ఎస్ ముఖ్యనేతలు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో విపక్ష నేతలు కలిసి కూర్చొని ఎవరికీ ఇబ్బంది కలిగించని, అందరికీ ఆమోదయోగ్యమైన, ఏకాభిప్రాయ అభ్యర్థిపై ముందు చర్చిస్తారని, ఆ తరువాత ఆ అభ్యర్థిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తారు.
కానీ ఇప్పుడు మాత్రం ముందే ఒక అభ్యర్థిని అనుకొని అతనితో సంప్రదింపులు కూడా ప్రారంభించిన తరువాత సమావేశాలు పెట్టడంలో ఆంతర్యం ఏమిటని టిఆర్ఎస్ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ కారణాల వల్ల ఈ సమావేశంలో పాల్గొనడం లేదని అవి స్పష్టం చేశాయి.