తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అవినీతిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సీబీఐకి ఫిర్యాదు చేశారు. బుధవారం ఢిల్లీలోని సీబీఐ డైరెక్టర్ సుబోద్ కుమార్ జైశ్వాల్కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్), ఆయన కుటుంబ సభ్యుల అవినీతిపై ఫిర్యాదు చేశారు. రూ.9 లక్షల కోట్ల అవినీతికి కేసీఆర్, ఆయన కుటుంబం పాల్పడిందని ఆరోపించారు.
ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి అవినీతి చూడలేదని ఫిర్యాదు కాపీలో పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబానికి ఆదాయానికి మించి ఉన్న ఆస్తులపై దర్యాప్తు జరపాలని పాల్ డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు రూ 60 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉండగా, కేసీఆర్ సర్కార్ రూ. 4.5 లక్షల కోట్ల అప్పు చేసిందని పేర్కొన్నారు.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్, ఎమ్మెల్సీ కవితలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. తెలంగాణతో పాటు సింగపూర్, దుబాయ్, అమెరికాలో అనేక ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవినీతికి పాల్పడ్డారని చెబుతూ ప్రాజెక్టు అంచనా బడ్జెట్ లక్షా 5 వేల కోట్లు కాగా.. 35 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని పాల్ ఆరోపించారు. ఏకంగా రూ.75 వేల కోట్లు దోచుకున్నారని విమర్శించారు.
యాదాద్రి అభివృద్ధిలోనూ అవినీతి జరిగిందని తెలిపారు. రూ.2 వేల కోట్ల అంచనాలో 200 కోట్లు ఖర్చు చేసి అంతా దోచుకున్నారని ఆరోపించారు. సీబీఐతో పాటూ కేంద్రమంత్రులు అమిత్ షా, పురుషోత్తం రూపాలాకు కేఏ పాల్ తన ఫిర్యాదు కాపీలను పంపారు.