తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలతో ప్రజలు అల్లాడిపోతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ లో నాలుగు రోజులుగా ఏంచేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మూసీకి వరద రావడంతో నీట మునిగిన ముసారాంబాగ్ బ్రిడ్జిని ఆయన పరిశీలిస్తూ కూడా భారీ వర్షాల కారణంగా లక్ష ఇళ్లు నీట మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గతేడాది కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తిందని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఏడాది తర్వాత కూడా మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి మార్పులు రాలేదని కేంద్ర మంత్రి మండిపడ్డారు. మూసీ డెవలప్ మెంట్ కోసం ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసినా ఒక్క అడుగు కూడా ముందు పడలేదని ధ్వజమెత్తారు.
ప్రాజెక్టు రిపోర్టు రెడీ అయిందని, రుణాలు వస్తున్నాయని చెప్పడం మినహా కేసీఆర్ సర్కారు చేసిందేమీలేదని ఎద్దేవా చేశారు. వరదలతో ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రగతిభవన్ దాటి బయటికి రాని కేసీఆర్ఇ ప్పుడు ఢిల్లీకి వెళ్లి ఏం చేస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ అండదండలతో కొందరు ఇష్టారాజ్యంగా మూసీని ఆక్రమిస్తున్నందునే ఏటా పేదల ఇళ్లు నీట మునుగుతున్నాయని కిషన్రెడ్డి ఆరోపించారు.
విపత్తు వేళ ఉపయోగించుకునేందుకు ఎస్డీఆర్ఎఫ్ నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ, రాష్ట్ర సర్కార్ విఫలమైందని కిషన్రెడ్డి విమర్శించారు. రాత్రి సమయంలో మట్టి పోసి మూసీ పరివాహక ప్రాంతాలను ఆక్రమిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆ కారణంగానే పరిసర ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి మూసీ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని చెప్పినా కేసీఆర్ సర్కారు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ లోని సబర్మతి నదిని పరిశీలించి వచ్చిన మంత్రులు మూసీపై రోడ్లు వేసి సుందరంగా తీర్చిదిద్దుతామని ప్రకటించినా అది కార్యరూపం దాల్చలేదని విమర్శించారు.
ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం మాత్రం రాజకీయ ఆలోచనలపైనే దృష్టి పెట్టారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో కేసీఆర్ నాలుగు రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా ఏం చేశారని నిలదీశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వరదల కారణంగా నష్టపోయిన వారికి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
ఎస్డీఆర్ఎఫ్ నిధుల విషంలో తప్పుడు ప్రకటనలు చేయడం సరికాదన్న ఆయన కేంద్రాన్ని, నరేంద్రమోడీని ఎంత విమర్శిస్తే టీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబం పట్ల ప్రజల్లో అంత వ్యతిరేకత పెరుగుతుందని హెచ్చరించారు. అధికారంలో ఉన్నన్ని రోజులు మంచి పనులు చేయాలని సూచించిన కిషన్ రెడ్డి ఏడాది తర్వాత తెలంగాణ ప్రజలు ఎలాగైనా కేసీఆర్ కుటుంబానికి అవకాశమివ్వరని చురకలంటించారు.