అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) క్రికెట్లో కొత్త నిబందనలు తీసుకొచ్చింది. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయని ఐసీసీ వెల్లడించింది. క్రికెట్లో కొన్ని నియమాలను మార్చుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. సౌరభ్ గంగూలీ నేతత్వంలోని పురుషుల క్రికెట్ కమిటీ చేసిన సిఫార్సులను చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదించింది.
ఈ నేపథ్యంలో మార్పులను ఐసీసీ వెల్లడించింది. కొత్త నిబంధనల ప్రకారం.. క్రీజులో ఉన్న బ్యాటర్ క్యాచ్ అవుట్ అయితే.. కొత్త బ్యాటర్ కచ్చితంగా స్ట్రైకింగ్ తీసుకోవాల్సిందే అని స్పష్టం చేసింది. బాల్ షైనింగ్ అయ్యేందుకు ఉమ్మిరాసే విధానాన్ని పూర్తిగా నిషేధించింది.
ఫీల్డ్ లోకి వచ్చే కొత్త ప్లేయర్ రెండు నిమిషాల్లో స్ట్రైక్ తీసుకోవాలి. ఫీల్డింగ్ సైడ్ వాళ్లు కావాలని బ్యాటర్లను ఇబ్బంది పెడితే.. బ్యాటింగ్ సైడ్ వాళ్లకు 5 పరుగులు పెనాల్టీ రూపంలో అంపైర్ ఇవ్వొచ్చు.
బౌలింగ్ టైంలో నాన్- స్ట్రైకర్ క్రీజులో లేకపోతే బౌలర్ ఔట్ చేయడాన్ని రనౌట్ గా పరిగణించనున్నారు. ‘మన్కడింగ్’ రూపంలో చేసే రనౌట్ను ఇక మీదట ‘అన్ఫెయిర్ ప్లే’ సెక్షన్ నుంచి ‘రన్ అవుట్’ సెక్షన్లోకి మార్చారు.
కొత్త నిబంధనలు
- ‘మన్కడింగ్’ రూపంలో చేసే రనౌట్ను ఇక మీదట ‘అన్ఫెయిర్ ప్లే’ సెక్షన్ నుంచి ‘రన్ అవుట్’ సెక్షన్లోకి మార్చారు.
- కొవిడ్ పరిస్థితుల్లో బాల్కు ఉమ్మి రాయడంపై ఇప్పటికే తాత్కాలిక నిషేధం అమల్లో ఉంది.ఇప్పుడూ దీన్ని శాశ్వతం చేశారు. ఇకపై బంతికి ఉమ్మిని రాయడం కుదరదు.
- బ్యాటర్ క్యాచ్ అవుట్ అయితే స్ట్రయికర్ ఉన్న స్థానంలోకే కొత్త బ్యాటర్ వస్తారు. క్యాచ్ పట్టే సమయంలో బ్యాటర్లు ఒకరినొకరు క్రాస్ చేసినా పరిగణనలోకి తీసుకోరు.
- బౌలర్ బౌలింగ్ చేస్తున్న సమయంలో.. ఫీల్డింగ్లో ఏదైనా ఉద్దేశపూర్వకమైన చర్యలు చేస్తే ఆ బాల్ను డెడ్ బాల్గా ప్రకటిస్తారు. దీంతో అంపైర్ బ్యాటింగ్ జట్టుకు పెనాల్టీ రూపంలో ఐదు పరుగులు ఇవ్వొచ్చు.
- టీ20ల్లో జనవరి 2022లో ప్రవేశపెట్టిన మ్యాచ్ పెనాల్టీని వన్డేలకు కూడా అమలు చేయనున్నారు. 2023లో ఐసీసీ పురుషులు వరల్డ్ కప్ లీగ్ పూర్తయిన అనంతరం ఇది అమలులోకి రానుంది.