దివంగత జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు దేశ ప్రజలతో పాటుగా ప్రపంచ దేశాల నేతలు మంగళవారం ఘనంగా తుది వీడ్కోలు పలికారు. టోక్యోలో జరిగిన ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, జపాన్ యువరాజు అకిషినో సహా ప్రపంచ దేశాలకు చెందిన 217 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
మూడు నెలల క్రితం జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఒక వ్యక్తి అబేను తుపాకితో కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఇపటికే అబే కుటుంబం ప్రైవేటుగా అంత్యక్రియలు నిర్వహించింది. అయితే ప్రభుత్వం మాత్రం అధికారికంగా మంగళవారం తుది వీడ్కోలు పలికింది. అబే సతీమణి చితాభస్మం ఉన్న కలశాన్ని టోక్యో హాలుకు తీసుకు రావడంతో అంత్యక్రియలు కార్యక్రమం మొదలైంది.
అక్కడ వేలాది మంది ఆయనకు తుది నివాళి అర్పించారు. 19 తుపాకుల అభివాదాన్ని అందుకున్నారు. జపాన్లో అధికార లాంఛనాలతో తుది వీడ్కోలు అందుకున్న రెండో నేతగా అబే నిలిచారు. ప్రభుత్వ అంత్యక్రియల కార్యక్రమం ముగిసిన అనంతరం మోదీ అబే సతీమణి కీ అబేతో వ్యక్తిగతంగా భేటీ అయి తన సంతాపాన్ని తెలియజేసినట్లు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది.
అంతకు ముందు జపాన్ ప్రధాని పుమియో కిషిదాతో మోదీ సమావేశమయ్యారు. అబే మరణానికి మోదీ తీవ్ర సంతాపం తెలియజేశారు. అనంతరం ఇరువురు నేతలు భారత్ జపాన్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. షింజో తన పదవీ కాలంలో బారత్ను నాలుగు సార్లు సందర్శించడం ఓ రికార్డు.
2014 జనవరిలో భారత గణతంత్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జపాన్ తొలి ప్రధానిగా ఘనత సాధించారు. యుపిఎ ప్రభుత్వం అనంతరం అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారుతో బలమైన సంబంధాలు నెరిపారు. అబేను మోదీతనకు అత్యంత సన్నిహిత మిత్రుడిగా అభివర్ణించేవారు. జపాన్ లో సుదీర్ఘకాలం తొమ్మిదేళ్లకు పైగా ప్రధాని పదవిలో ఉన్న నేతగా కూడా గుర్తింపు పొందారు.