దేశవిదేశాల్లో 7వ ఆయుర్వేద దినోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ప్రజలందరికి ఆయుర్వేద వైద్యం ప్రయోజనాలు తెలియజేసి ఆయుర్వేద వైద్య విధానానికి మరింత ప్రచారం కల్పించేందుకు ఈ ఏడాది ఆయుర్వేద దినోత్సవాన్ని “హర్ దిన్ హర్ ఘర్ ఆయుర్వేదం” అనే ఇతివృత్తంతో నిర్వహించారు.
ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఆరు వారాల పాటు దేశవ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రజలు ఉత్సాహంగా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ దాదాపు 25 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, విదేశాంగ శాఖ సహకారంతో దేశం వివిధ ప్రాంతాలు, విదేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాలు, మిషన్లలో ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహించింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ 5000 కి పైగా కార్యక్రమాలు నిర్వహించింది.
ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా, ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్, విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి, ఆయుష్ శాఖ సహాయ మంత్రి డా. ముంజ్పరా మహేంద్రభాయ్ కాలుభాయి పాల్గొన్నారు.
సర్బానంద సోనోవాల్ ఆయుర్వేదాన్ని వ్యాధుల నివారణ శాస్త్రంగా వర్ణించారు. ఆయుర్వేదం పురాతనమైన విజ్ఞాన శాస్త్రం అని పేర్కొన్నారు. భారతదేశానికి చెందిన పరిశోధన మండళ్లు ఆయుష్ రంగంలో కొన్ని పరిశోధనలు చేపట్టాయని సోనోవాల్ తెలిపారు.
అర్జున్ ముండా మాట్లాడుతూ “ఆయుర్వేదం భారతదేశ ప్రాచీన సంప్రదాయం మరియు సంపద. అడవుల్లో నివసించే ప్రజల సహకారంతో ఆయుర్వేదాన్ని మరింత అభివృద్ధి చేయవచ్చు. ఆయుర్వేదం మాత్రమే జబ్బుపడిన తర్వాత చికిత్స అందించకుండా వ్యాధి నివారణ అంశానికి ప్రాధాన్యత ఇస్తుంది” అని పేర్కొన్నారు.
ఆయుష్ మంత్రిత్వ శాఖ దేశంలో ఆయుష్ ఆరోగ్య వ్యవస్థను వేగవంతం చేసిందని, ప్రస్తుతం 30 దేశాల్లో ఆయుర్వేదానికి గుర్తింపు ఉందని డాక్టర్ ముంజ్పరా మహేంద్రభాయ్ కాళూభాయ్ చెప్పారు. ప్రస్తుతం ఆయుష్ లావాదేవీలు 18.1 బిలియన్ డాలర్ల వరకు జరుగుతున్నాయని అని ఆయన తెలియజేశారు.
శ్రీమతి మీనాక్షి లేఖి మాట్లాడుతూ “మన పూర్వీకుల శాస్త్రాన్ని గుర్తించి గౌరవించాల్సిన సమయం ఇది. 5000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన పురాతనమైన ఒక శాస్త్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యవేక్షణలో ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా జరుపుకుంటారు. ఇటీవల కాలంలో ఈ రంగానికి మరింత ప్రాధాన్యత పెరిగింది.” అని వివరించారు.
గిరిజన అభివృద్ధి.రెండు మంత్రిత్వ శాఖల మధ్య సహకారం, కలయిక, సమ్మేళనం అంశాలపై ఆయుష్ మంత్రిత్వ శాఖ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అవగాహన కుదిరింది. గిరిజన సంస్కృతి వారసత్వ పరిరక్షణ, అభివృద్ధికి గల అంశాలను గుర్తించేందుకు సామర్థ్య అభివృద్ధి రంగాల్లో కలిసి పనిచేసే విధంగా రెండు మంత్రిత్వ శాఖలు అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి.
ఈ సందర్భంగా ‘ది ఆయుర్వేదిక్ ఫార్మాకోపియా ఆఫ్ ఇండియా’, ‘ది ఆయుర్వేదిక్ ఫార్ములరీ ఆఫ్ ఇండియా’ పుస్తకాన్ని విడుదల చేశారు. ఔషధ మొక్కల ఆరోగ్య ప్రయోజనాల గురించి అవగాహన కల్పించేందుకు, ఆయుష్ మంత్రిత్వ శాఖ అశ్వగంధ – ఆరోగ్య ప్రమోటర్పై జాతుల-నిర్దిష్ట జాతీయ ప్రచార కార్యక్రమాన్నిప్రారంభించింది.