ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ బ్లూటిక్ వెరిఫికేషన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతానికి ఐఓఎస్ ఆధారితంగా పనిచేసే ఫోన్లకే ఇది పరిమితమైంది. అదికూడా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్డమ్లో మాత్రమే ఇది అందుబాటులో ఉన్నది. ప్రీమియం సర్వీసులు నెల రోజుల్లో భారత్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు.
త్వరలోనే ఈ సేవలను మిగిలిన ప్రాంతాలకు విస్తరిస్తామని, అన్ని డివైజ్లకు అందుబాటులోకి తెస్తామని సంస్థ వెల్లడించిండింది. అయితే ఈ సేవలను పొందాలంటే నెలకు 7.99 అమెరికన్ డాలర్లు చెల్లించాల్సిందే. ప్రస్తుతానికి ఐఓఎస్ ఆధారితంగా పనిచేసే ఆపిల్ ఐ ఫోన్లలో మాత్రమే ఈ బ్లూటిక్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
ట్విట్టర్ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత సంస్కరణలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఖర్చులను తగ్గించుకోవడానికి సగం మందికి పైగా ఉద్యోగులను తొలగించారు.
ఇక ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి చెల్లింపుల ప్రాతిపదికన బ్లూటిక్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. మరిన్నింటిని త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని సంస్థ ప్రకటించింది. ట్విట్టర్ ప్రకారం బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్ (బ్లూ టిక్) అంటే ఖాతా నిజమైనది, అలాగే ప్రజా ప్రయోజనం కోసం నిర్వహిస్తున్నది అని ఇచ్చే గుర్తింపు. ఈ టిక్ పొందడానికి ట్విట్టర్ అకౌంట్ యాక్టివ్గా ఉండటం చాలా ముఖ్యం.
ప్రస్తుతం ట్విట్టర్ ప్రభుత్వ సంస్థలు, బ్రాండ్లు, లాభాపేక్షలేని సంస్థలు, వార్తా సంస్థలు, జర్నలిస్టులు, ఎంటర్టైన్మెంట్, క్రీడలు, ఇ-స్పోర్ట్స్ రంగాల్లో ఉన్నవారి నిర్ధిష్ట ఖాతాలను ధ్రువీకరించి ఉచితంగానే ఈ బ్లూ టిక్ ఇస్తూవస్తున్నది. తాజా పరినామాల నేపథ్యంలో ఇకపై ఈ సేవలు పొందాలంటే డబ్బు చెల్లించాల్సిందే.
ట్విట్టర్లో భారీగా ఉద్యోగులను తొలగించాలనే తన నిర్ణయాన్ని ఎలాన్ మస్క్ సమర్థించుకొంటూ తొలగింపు తప్పనిసరి అని చెప్పారు. ప్రతి రోజూ దాదాపు రూ.32 కోట్ల నష్టం వస్తున్నదని పేర్కొంటూ ఈ నష్టాన్ని ఎన్ని రోజులని భరిస్తాం? అని ప్రశ్నించారు.
కాబట్టి ఉద్యోగుల ప్రక్షాళన తప్పనిసరి, వారిని భారీ స్థాయిలో తొలగించడం అనివార్యం అని స్పష్టం చేశారు. భారత్లో 200 మందికిపైగా ఉద్యోగులను తొలగిస్తున్నారు. మరోవైపు అసత్య వార్తలను, విషయాలను ప్రచారం చేసే ట్విట్టర్ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేయడం విచారకరమని అమెరికా అధ్యక్షుడు బైడెన్ పేర్కొన్నారు.