మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అధ్యక్షతన సిట్ను ఏర్పాటు చేశారు. నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి, సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ కమలేశ్వర్ సింగేనవర్, శంషాబాద్ డీసీపీ ఆర్ జగదీశ్వర్ రెడ్డి, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్ డివిజన్ ఏసీపీ గంగాధర్, మొయినాబాద్ ఎస్హెచ్వో లక్ష్మీరెడ్డి సభ్యులుగా కొనసాగనున్నారు.
దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తూ హోం శాఖ కార్యదర్శి బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసు విచారణపై ఇచ్చిన స్టే ఉత్తరువులను తొలగించిన హైకోర్టు కేసును పోలీసులు దర్యాప్తు చేయవచ్చని తెలుపుతూ దర్యాప్తును నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను మంగళవారం కోర్టు రద్దు చేసింది. ఎంతో కాలంపాటు దర్యాప్తును వాయిదా వేయడం సబబు కాదని న్యాయమూర్తి జస్టిస్ బీ విజయసేన్రెడ్డి ధర్మాసనం స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసుపై సత్వర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్నదని పేరొన్నది. సమగ్రంగా, లోతుగా, సత్వరమే విచారణ నిర్వహిస్తామని పేర్కొంటూ తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి (తాండూరు), రేగా కాంతారావు (పినపాక), బీరం హర్షవర్ధన్ రెడ్డి (కొల్లాపూర్), గువ్వల బాలరాజు (అచ్చంపేట) అక్టోబర్ 26న సాయంత్రం హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫామ్హౌస్లో ప్రత్యక్షమయ్యారు.
ఇద్దరు స్వామిజీలు, మరో వ్యక్తి కలిసి టీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరేలా ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారంటూ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అదే రోజు రాత్రి మొదట ముగ్గురు ఎమ్మెల్యేలు.. తర్వాత కాసేపటికి మరో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని పోలీసులు ప్రగతి భవన్కు తీసుకెళ్లారు. ఆ రోజు నుంచి నలుగురు ఎమ్మెల్యేలు తమకు తాముగా ప్రగతి భవన్ నుంచి బయటికి రాలేదు.
ఈ కేసును సీబీఐ లేదా హైకోర్టు ఏర్పాటుచేసే సిట్కు బదిలీ చేయాలని బీజేపీ నేత ప్రేమేందర్రెడ్డి రిట్ దాఖలు చేశారు. ముగ్గురు నిందితులు కూడా సీబీఐ దర్యాప్తు కోరుతూ రిట్ వేశారు. ఫోన్ల ట్యాపింగ్పై మరో పిటిషన్ దాఖలైంది. ఈ కేసులన్నింటిలోనూ రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
రెండు వారాల సమయం కావాలని ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ జే రామచంద్రరావు కోరారు. ఇందుకు ప్రతివాదుల తరఫు న్యాయవాది సీహెచ్ ప్రభాకర్ అభ్యంతరం చెప్తూ గడువు ఎక్కువ ఇవ్వవద్దని కోరారు. దీంతో విచారణను ధర్మాసనం ఈ నెల 18కి వాయిదా వేసింది.
ఇలా ఉండగా, మునుగోడు ఉప ఎన్నికలో తమకు కేటాయించిన గ్రామాల వైపు నలుగురు ఎమ్మెల్యేలు కన్నెత్తి చూడలేదు. తమ సొంత నియోజకవర్గాలకు వెళ్లలేదు. కుటుంబ సభ్యులు, మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మరోవైపు ఫామ్హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంపై అనేక సందేహాలు ఉన్నాయి. ఈ వివాదం కోర్టుల్లో పెండింగ్లో ఉంది.