గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తెల్లా హేని క్రిస్టినా, ఆమె భర్త కత్తెర సురేష్ కుమార్ షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తులు కాదని, వారు క్రైస్తవులే అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రకటించింది. గుంటూరు జిల్లా కొల్లిపర గ్రామానికి చెందిన మండ్రు సరళ కుమారి దాఖలు చేసిన పిటిషన్ మేరకు హైకోర్టు ఈ ప్రకటన చేసింది.
భార్యాభర్తలు ఇరువురు షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తులే అంటూ జిల్లా గుంటూరు జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు తోసిపుచ్చింది. క్రైస్తవ ఆచార వ్యవహారాలు పాటిస్తూ, హార్వెస్ట్ ఇండియా అనే ఒక క్రిస్టియన్ సంస్థను నడుపుతున్న సురేష్ కుమార్, హెనీ క్రిస్టినా దంపతులు ఇకపై షెడ్యూల్ కుల హోదాకు అర్హులు కాదని స్పష్టం చేసింది.
గతంలో జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలు రద్దు పరుస్తూ, మూడు నెలల్లోపు సవరించిన ఉత్తర్వులు ఇవ్వవలసిందిగా గుంటూరు జిల్లా కలెక్టరుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తులు మతం మారితే ఇకపై వారికి ఎస్సీ హోదా వర్తించదని 1950 రాజ్యాంగ ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. ఇదే విషయాన్ని గతంలో అనేక కోర్టులతో పాటు సుప్రీంకోర్టు కూడా పునరుద్ఘాటించింది.