విశేష ప్రఖ్యాతి పొందిన టీటీడీ ముద్రించే క్యాలెండర్లు, డైరీలు 2023 సంవత్సరానికి సంబంధించి భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. తిరుపతితో పాటు, తిరుమలలోని టీటీడీ పుస్తక విక్రయ కేంద్రాల్లో వీటిని అందుబాటులో ఉంచినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
అలాగే ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయాలతోపాటు కాకినాడ, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, రాజమహేంద్రవరం, తెలంగాణలోని హనుమకొండ టీటీడీ కల్యాణ మండపాల్లో డైరీలు, క్యాలెండర్లు అందుబాటులో ఉన్నాయని వారు చెప్పారు.
ధర విషయానికొస్తే పెద్ద డైరీ రూ.150 కాగా, చిన్న డైరీ రూ.120కు లభిస్తుంది. క్యాలెండర్ రూ.130గా ఉంది. టేబుల్ క్యాలెండర్ రూ.75గా నిర్ణయించారు. టీటీడీ క్యాలెండర్లు, డైరీలను భక్తులు tirupatibalaji.ap.gov.in వెబ్సైట్లో పబ్లికేషన్స్ను క్లిక్ చేసి డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఆర్డరు చేసుకోవచ్చునని తెలిపారు.
పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఇంటివద్దకే అందిస్తున్నట్లు తితిదే తెలిపింది. భక్తులు డీడీ తీసి పంపొచ్చు. ఇందుకోసం ‘కార్యనిర్వహణాధికారి, టీటీడీ, తిరుపతి’ పేరిట ఏదైనా నేషనల్ బ్యాంకులో డీడీ తీసి కవరింగ్ లెటర్తో కలిపి ‘ప్రత్యేకాధికారి, పుస్తక ప్రచురణల విక్రయ విభాగం, ప్రెస్ కాంపౌండ్, కేటీ రోడ్డు, తిరుపతి’ అనే అడ్రస్కు పంపాల్సి ఉంటుందని చెప్పారు.
ప్రైవేటు ట్రాన్స్పోర్టు ద్వారా కూడా భక్తులకు టీడీడీ క్యాలెండర్, డైరీలను పంపనున్నట్లు టీటీడీ అధికారులు చెప్పారు. అందుకు ట్రాన్స్పోర్టు ఛార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 99639 55585, 0877-2264209 ఫోన్ నెంబర్లకు కాల్ చేసి సంప్రదించవచ్చునని తెలిపారు.