ప్రధాని నరేంద్ర మోదీ జనవరి మూడో వారంలో సికింద్రాబాద్-విజయవాడ మధ్య ‘వందే భారత్ ఎక్స్ప్రెస్’కు జెండా ఊపి ఆరంభించనున్నారు. జనవరి19-20 మధ్య ప్రధాని తెలంగాణలో పర్యటించనున్నారు. అయితే ఆయన వచ్చే తేదీలు ఇంకా ఖరారు కావలసి ఉంది.
ప్రస్తుతం దేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్లు న్యూఢిల్లీ-వారణాసి, న్యూఢిల్లీ-వైష్ణో దేవి కత్రా, న్యూఢిల్లీ-చండీగఢ్-ఉనా, ముంబై-అహ్మదాబాద్-గాంధీనగర్, చెన్నై-బెంగళూరు-మైసూరు మధ్య నడుస్తున్నాయి. వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది దేశంలోనే అత్యంత వేగంగా వెళ్లే సెమీ హైస్పీడ్ అత్యాధునిక రైలు. సికింద్రాబాద్-విజయవాడ మధ్య నడవబోయేది 8వ వందే భారత్ ఎక్స్ప్రెస్.
ఇంతకు ముందు పశ్చిమ బెంగాల్లో హౌరా-న్యూ జల్పాయ్గురి రూట్లో డిసెంబర్ 30న ఏడో వందే భారత్ ఎక్స్ప్రెస్ను ఆరంభించారు. వందే భారత్ ఎక్స్ప్రెస్లో వెనక్కి వాలే సీట్లుంటాయి. ఇక ఎగ్జిక్యూటివ్ బోగీలో 180 డిగ్రీల మేరకు రొటేట్ అయ్యే సీట్లుంటాయి.
వీటికి తోడు ఆటోమేటిక్ తలుపులు, జిపిఎస్ ఆధారిత ఆడియో-విజువల ప్యాసెంజర్ ఇన్ఫార్మేషన్ సిస్టం, ఎంటర్టైన్మెంట్ కోసం ఆన్బోర్డ్ హాట్స్పాట్ వైఫీ, సౌకర్యవంతమైన సీట్లు తదితర ఆకర్షణీయాలు ఉంటాయి. వందే భారత్ రైలు ట్రయల్ రన్ లో గంటకు 180 కిమీ వేగం అందుకోవడం విశేషం.
వందేభారత్ ను ప్రారంభించటంతో పాటుగా సికింద్రబాద్ రీడెవలప్ మెంట్ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఇందు కోసం రూ 699 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రస్తుత భవనాలను కూల్చి అంతర్జాతీయ ప్రమాణాలు.. పూర్తిస్థాయి వసతులతో నూతనంగా నిర్మించనున్నారు. 36 నెలల్లో ఈ పనులు పూర్తి కానున్నాయి.