వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. మార్చి 5న పాలేరులో పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. వైఎస్సార్ సంక్షేమ పాలన కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం షర్మిల ఈ యాత్ర చేపట్టారు.
2021, అక్టోబర్ 20న చేవెళ్లలో ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించారు. ఆమె తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గతంలో ఇక్కడి నుండి చారిత్రాత్మక పాదయాత్ర ప్రారంభించడం గమనార్హం. అంతేకాదు, ముఖ్యమంత్రిగా ప్రతి ముఖ్యమైన కార్యక్రమాన్ని దాదాపుగా ఇక్కడి నుండే ప్రారంభించేవారు.
నాటి నుంచి నేటి వరకు షర్మిల ప్రజల మధ్యలో తిరుగుతూ వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూ.. ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. ఇప్పటివరకు 82 నియోజకవర్గాలకు పైగా పాదయాత్ర సాగింది. షర్మిల చేపట్టిన పాదయాత్ర శుక్రవారం 238వ రోజుకు చేరుకుంది.
మొత్తం 3700 కిలోమీటర్లకు పైగా షర్మిల పాదయాత్ర చేశారు. దీంతో, మార్చి 5 నాటికి 4,111కి.మీ మైలు రాయికి చేరనుంది. ఈ నెల 20న పాదయాత్రతో పాలేరు నియోజకవర్గంలో షర్మిల అడుగుపెట్టనున్నారు.
మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో పాదయాత్ర ముగించుకొని పాలేరుకు చేరుకుంటారు. ఆ తర్వాత తిరుమలాయపాలెం మండలం ఇస్లావత్ తాండా వద్ద పాలేరు మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. 14 రోజుల పాటు ఈ నియోజకవర్గంలో యాత్రను కొనసాగించి.. పాలేరులో ప్రజాప్రస్థానం ముగింపు సభ నిర్వహించనున్నారు.
ఈ ఏడాడి ఆగస్టు-సెప్టెంబర్ మధ్య ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్.. భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించిన తరువాత ఎదుర్కొనబోతోన్న తొలి ఎన్నికలు ఇవే కావడంతో బీఆర్ఎస్ దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పాదయాత్ర అనంతరం ఆమె అభ్యర్థుల ఎంపిక గురించి దృష్టిసారించి అవకాశం ఉంది.