అసోంలో హెచ్3ఎన్2 ఇన్ఫ్లుయెంజా వైరస్ తొలి కేసు బుధవారం నమోదైంది. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ దీన్ని ధ్రువీకరించింది. రియల్ టైమ్ ప్రాతిపదికన ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (ఐడిఎస్పి) నెట్వర్క్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న సీజనల్ ఇన్ఫ్లుఎంజా పరిస్థితిపై నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది.
ఐసీఎంఆర్ రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా అసోంలో సవాల్ను ఎదుర్కొనేందుకు ఆరోగ్యశాఖ అధికారులు సిద్ధంగా ఉన్నారని పేర్కొంది. ఇదిలా ఉండగా.. దేశంలో ఇప్పటి వరకు 452 హెచ్3ఎన్2 వైరస్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో వైరస్ కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఇటీవల కర్ణాటకలో ఒకరు, హర్యానాలో ఒకరు మృతి చెందారు. తాజాగా మహారాష్ట్ర అహ్మద్నగర్కు చెందిన ఓ ఎంబీబీఎస్ విద్యార్థి సైతం వైరస్ కారణంగా మృతి చెందినట్లు తెలుస్తున్నది. అలాగే గుజరాత్కు చెందిన ఓ మహిళ సైతం మంగళవారం ఫ్లూ లక్షణాలతో మృతి చెందిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఫ్లూ కేసులు భారీగా పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
దేశంలో పలుచోట్ల హెచ్3 ఎన్2 క్రమంగా విజృంభిస్తుండటం కలవరపెడుతుండడంతో పుదుచ్చేరి విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ఫ్లుయెంజా వ్యాప్తి కొనసాగుతున్నందున పది రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. అన్ని స్కూళ్లలో 8 వ తరగతి వరకు సెలవులు ఇస్తున్నామని, మార్చి 16 నుంచి 24 వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని రాష్ట్ర విద్యా శాఖ వెల్లడించింది.
హెచ్3ఎన్2 వైరస్ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని.. రాష్ట్రంలో క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతుందని, పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారని.. వైరస్ కట్టడిని అరికట్టటానికి అన్ని స్కూల్స్ ను మార్చి 16 నుంచి 26వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. పుదుచ్చేరిలో ఇప్పటికే అధికారికంగా 90 కేసులు నమోదయ్యాయి.. పరీక్షలు చేయించుకోకుండా వైరస్ లక్షణాలతో ఎక్కువ మంది బాధపడుతున్నారని భావిస్తుంది ప్రభుత్వం.