మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ ఆమ్ ఆద్మీ పార్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఉద్దేశించి జైలు నుంచి మరో లేఖ విడుదల చేశాడు. లేఖలో కేజ్రీవాల్తో పాటు టీఆర్ఎస్ నేతల ప్రస్తావన చేశాడు.
కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ ఆదేశాల మేరకు రూ. 15 కోట్లు టీఆర్ఎస్ కార్యాలయంలో ఇచ్చానని చెప్పాడు. డబ్బు ముట్టినట్టు టీఆర్ఎస్ నేత చేసిన చాట్ స్క్రీన్ షాట్లు ఉన్నాయని వెల్లడించారు. సౌత్ గ్రూపులో ఉన్న టీఆర్ఎస్ నేతతో కేజ్రీవాల్కు ఉన్న సంబంధాలు స్పష్టంగా బయటపడుతున్నాయని, ఆ టీఆర్ఎస్ నేత ప్రస్తుతం ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణ ఎదుర్కొంటున్నారని వెల్లడించాడు.
తన సహాయకుడు ఏపీ (అరుణ్ పిళ్ళై)కి రూ. 15 కోట్లు ఇవ్వాల్సిందిగా ఆ టీఆర్ఎస్ నేత చాట్లో స్పష్టంగా చెప్పారని సుఖేశ్ లేఖలో తెలిపాడు. రూ. 15 కోట్లను 15 కేజీల నెయ్యిగా చాట్లో పేర్కొన్నారని, పిళ్ళై క్యాష్ బాక్సులను నలుపు రంగు రేంజ్ రోవర్ స్పోర్ట్స్ మోడల్ (రిజిస్ట్రేషన్ నెంబర్ 6060)లో పెట్టారని స్పష్టం చేశాడు.
కారు విండ్షీల్డ్పై ఎమ్మెల్సీ అనే స్టిక్కర్ ఉందని, అది టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులోనే పార్క్ చేసి ఉందని వెల్లడించాడు. చాట్ స్క్రీన్ షాట్ల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ – టీఆర్ఎస్ మధ్య ఉన్న ఆర్థిక, వ్యాపార బంధాలు స్పష్టమవుతున్నాయని వెల్లడించాడు. ఇప్పుడు విడుదల చేస్తున్న చాట్ స్క్రీన్ షాట్లు కేవలం స్టార్టర్లు మాత్రమేనని, మెయిన్ కోర్సు ఇంకా ఉందన్నాడు.
తాను మాట్లాడే ప్రతి మాటకు తన దగ్గర సాక్ష్యం ఉందని, అవసరమైతే నార్కో, పాలీగ్రాఫ్ టెస్టులకు కూడా తాను సిద్ధమని ప్రకటించాడు. సోమవారం ఈడీ, సిబిఐలకు వాట్సప్, టెలీగ్రాప్ చాట్లను అందజేస్తానని సుకేశ్ చంద్రశేఖర్ తెలిపాడు. మొత్తం 703 చాట్లు ఉన్నాయని చెప్పాడు.
అతడు తన లేఖలో ప్రస్తావించిన ‘ఏపీ’ అనే వ్యక్తి ఎవరంటే.. మద్యం కుంభకోణంలో ఆ పేరుగల వ్యక్తి అరుణ్ పిళ్లై ఒక్కరే. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు తాను బినామీనని తొలుత ఈడీ అధికారుల ముందు ఒప్పుకొన్న పిళ్లై.. ఆ తర్వాత తన ప్రకటనను ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.