కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో మంచి పనితీరు కనబర్చిన గ్రామ పంచాయతీలకు ‘దీన్దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్-2023’, ‘నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్-2023’ పేరుతో పురస్కారాలను అందజేసింది. దేశంలో మొత్తం 46 గ్రామ పంచాయతీలకు అవార్డులు దక్కగా.. అందులో ఒక్క తెలంగాణ రాష్ట్రానికే 13 పురస్కారాలు రావడం విశేషం.
ఢిల్లీలోని విజ్ఞానభవన్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు అందుకున్నారు. జాతీయ అవార్డులతో పాటు ప్రత్యేకంగా నగదు పురస్కారాలను ఉత్తమ గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు – 2023లో తెలంగాణకు చెందిన 4 గ్రామాలు వివిధ విభాగాల్లో నెంబర్ వన్ గా నిలిచాయి. అందులో -ఆరోగ్య పంచాయతీ విభాగంలో గౌతంపూర్ (భద్రాద్రి కొత్త గూడెం ), -సమృద్ధిగా మంచినీరు అందుబాటులో ఉన్న విభాగంలో నెల్లుట్ల ( జనగామ), -సామాజిక భద్రత విభాగంలో కొంగట్పల్లి (మహబూబ్ నగర్), -స్నేహ పూర్వక మహిళా గ్రామాల విభాగంలో అయిపూర్ (సూర్యాపేట), -పేదరిక నిర్మూలన, జీవనోపాధులు విభాగంలో మందొండి (గద్వాల), -సుపరిపాలన గ్రామ పంచాయతీల విభాగంలో చీమల్దారి ( వికారాబాద్), -క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ విభాగంలో సుల్లాన్పూర్ (పెద్దపలి), -స్వయం సమృద్ధ మౌలిక సదుపాయాల విభాగంలో గంభీర్రావుపేట (రాజన్న సిరిసిల్ల) ఉన్నాయి.
నానాజీ దేశ్ ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ – 2023లో ఉత్తమ బ్లాక్ (మండల) పంచాయతీల అవార్డు విభాగంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఎల్.ఎం.డి, ఉత్తమ జిల్లా పరిషత్ విభాగంలో ములుగు జిల్లా, స్పెషల్ కేటగిరీ అవార్డుల్లో… గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయత్ పురస్కార్ విభాగంలో ఆదిలాబాద్ జిల్లా ముఖరా కె గ్రామం, కార్బన్ న్యూట్రల్ విశేష్ పంచాయతీ పురస్కార్ విభాగంలో రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా గ్రామం, నాన్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ – సర్టిఫికేట్ల విభాగం – గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయత్ పురస్కార్ కు సిద్దిపేట జిల్లా మార్కూక్ మండలంలోని ఎర్రవెల్లి ఎంపికైంది.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం 46 ఉత్తమ అవార్డుల్లో 13 అవార్డులను తెలంగాణ కైవసం చేసుకోవడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు.
‘దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామ పంచాయతీలు ఈ అవార్డుల కోసం పోటీ పడగా అందులో కేవలం 46 గ్రామాలు మాత్రమే అవార్డులు దక్కించుకున్నాయి. ఇందులోంచి 13 అవార్డులు తెలంగాణకే వచ్చినయ్. అంటే ప్రకటించిన మొత్తం జాతీయ అవార్డుల్లో 30శాతం రాష్ట్రమే కైవసం చేసుకున్నది. ఈ 13 ర్యాంకుల్లోంచి కూడా నాలుగు ఫస్ట్ ర్యాంకులు తెలంగాణకే రావడం గొప్పవిషయం’ అంటూ హర్షం వ్యక్తం చేశారు.
