మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్సార్ సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఈ నెల 25 వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అవినాష్రెడ్డి విచారణ ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని హైకోర్టు సూచించిన కోర్టు.. ముందస్తు బెయిల్ పిటిషన్పై 25న తుది తీర్పును వెల్లడించనున్నట్లు వెల్లడించింది.
అంతకు ముందు బెయిల్ పిటిషన్పై సీబీఐతో పాటు ఎంపీ అవినాష్రెడ్డి, సునీతారెడ్డి న్యాయవాదులు వాదనలు వినిపించారు. సీబీఐ బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరింది. అయితే అవినాష్రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ ఎందుకు తొందరపడుతుందని ఆయన తరఫు న్యాయవాది ప్రశ్నించారు.
అవినాష్ నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని, ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. అధికారులు హంతకులను వదిలేసి భాస్కర్రెడ్డి, అవినాష్ రెడ్డి వెనుక పడ్డారని, రాజకీయ కారణాలతోనే ఇబ్బందులు పెడుతున్నారని అవినాష్రెడ్డి తరఫు లాయర్ వాదించారు. ఈ క్రమంలో అసలు వివేకా హత్యకు కారణాలు ఏంటని కోర్టు ప్రశ్నించింది.
నాలుగు కారణాలు ఉన్నాయని అవినాష్ రెడ్డి తరఫు లాయర్ చెప్పారు. 1) వివేకానందరెడ్డి రెండో భార్యతో సునీతకు విభేదాలున్నాయి 2) ఎర్ర గంగిరెడ్డితో వ్యాపార లావాదేవీల్లో గొడవలు ఉన్నాయి 3) సునీల్ యాదవ్ కుటుంబంతో విభేదాలు ఉన్నాయి 4) హత్యకు రాజకీయ కారణాలు కూడా ఉండవచ్చు అని అవినాష్ రెడ్డి లాయర్ తెలిపారు.
ఈ నెల 25వ తేదీ వరకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయొద్దని సీబీఐకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా 25వ తేదీ వరకు సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి హాజరు కావాలని ఆదేశించింది. వాదనలు కొనసాగుతుండగానే.. ఎంపీ అవినాష్రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చింది.
వివేకా హత్య కేసులో అవినాష్ ప్రమేయం ఉన్నట్లు సాక్ష్యాలు, సైంటిఫిక్ ఎవిడెన్స్ సేకరించామని సీబీఐ తరఫున న్యాయవాది తమ వాదనలు వినిపించారు. రూ. 40 కోట్ల డీల్ జరిగినట్లు అధారాలు సేకరించామని న్యాయస్థానానికి తెలిపారు. సాక్ష్యాలు తారుమారుచేయడంలో అవినాష్ది కీలక పాత్ర ఉన్నట్లు భావిస్తున్నామని, వివేకా తలకు బ్యాండేజ్ వేసి సహజ మరణంగా చిత్రీకరించారని చెప్పారు.
ఉదయ్ తండ్రి జయప్రకాశ్ రెడ్ది చేత ఇదంతా చేయించారని, అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు విచారణలో అవినాష్ రెడ్డి సరైన సమాధానాలు ఇవ్వడం లేదు.. అవినాష్కు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని సీబీఐ తరపు లాయర్ వాదనలు వినిపించారు.
‘వైఎస్ వివేకా హత్య కుట్ర అవినాష్రెడ్డికి ముందే తెలుసు. గత నాలుగు విచారణల్లో ఆయన సహకరించలేదు. దర్యాప్తులో కీలక ఆధారాలను సేకరించాం. హత్యకు ముందు, ఆ తర్వాత అవినాష్ ఇంట్లో సునీల్ యాదవ్, ఉదయ్ ఉన్నారు. హత్యను గుండెపోటుగా ఎందుకు చిత్రీకరించారో తెలియాలి’ అంటూ వాదించారు.
`హత్య జరిగిన రోజు ఉదయం అవినాష్రెడ్డి జమ్మలమడుగు సమీపంలో ఉన్నట్లు తెలిపారు. కానీ, ఆయన మొబైల్ సిగ్నల్స్ పరిశీలిస్తే ఇంట్లోనే ఉన్నట్లు తేలింది. ఆ రాత్రంతా ఆయన తన ఫోన్ను అసాధారణంగా వినియోగించినట్లు గుర్తించాం’ అని సీబీఐ తరఫు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు