సీఎం కేసీఆర్తో పాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో జైలుకెళ్లి, బెయిల్ పై విడుదలై వచ్చిన తీన్మార్ మల్లన్న తాను కొత్త పార్టీ పెడుతున్నట్టు కీలక ప్రకటన చేశారు. తెలంగాణ నిర్మాణ పార్టీ పేరుతో పార్టీ పెట్టబోతున్నట్టు చెబుతూ మంత్రి మల్లా రెడ్డి సొంత నియోజకవర్గమైన మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ సెక్షన్లను నమ్మాడని, అయితే తాము వీకర్ సెక్షన్స్ తో ఉన్నామని ఆయన చెప్పారు. జైలు నుంచి విడుదలైన మల్లన్నకు ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. మల్లన్న విడుదల సందర్భంగా ఆయన అభిమానులు బాణసంచాతో సంబరాలు నిర్వహించారు. జైలు నుంచి మల్లన్న విడుదలైన తర్వాత ర్యాలీ తీశారు.
తీన్మార్ మల్లన్నకు మల్కాజ్ గిరి న్యాయస్థానం సోమవారం బెయిల్ మంజూరు చేసింది. మల్లన్నతో పాటు క్యూ న్యూస్ స్టాఫ్ట్ సుదర్శన్ గౌడ్, బండారు రవీందర్, ఉప్పల నిఖిల్, సిర్రా సుధాకర్, చింత సందీప్ కుమార్ లకు కూడా కోర్టు బెయిల్ ఇచ్చింది. ఒక్కొక్కరి దగ్గర రూ.20వేల ష్యూరిటీని పూచీకత్తుగా తీసుకుని బెయిల్ మంజూరు చేసింది.
మల్లన్నపై మేడిపల్లి పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఇందులో క్రైం నెంబర్ 294, క్రైం నెంబర్ 299 రెండింటిలో మల్లన్నకు న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. 3 నెలల పాటు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య మేడిపల్లి పోలీసుల ముందు హాజరు కావాలని షరతు విధించింది. మల్లన్నను మార్చి 21న మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
