కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జనార్దన రెడ్డి తనకు బళ్లారి వెళ్లడానికి అవకాశం కల్పించాలని, దాని కోసం బెయిల్ నిబంధనలను సడలించాలని జనార్దన్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించగా, దానికి సుప్రీం ధర్మాసనం నిరాకరించిది.
జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సుందరేష్ల ధర్మాసనం గాలి విజ్ఞప్తిని తోసి పుచ్చింది. బెయిల్ నిబంధనలు సడలించడం కుదరదని స్పష్టం చేసింది. ఎన్నికలు ముగిసిన తర్వాత మరోసారి కోర్టులో పిటిషన్ వేయడానికి జనార్దన్ రెడ్డి తరఫు న్యాయవాది అనుమతి కోరగా, దానికి కూడా సుప్రీం కోర్టు తిరస్కరించింది.
మరోవైపు గతేడాది డిసెంబర్ లో బీజేపీని వీడిన గాలి జనార్దన రెడ్డి ఆ తర్వాత సొంతంగా పార్టీ పెట్టారు. ‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష’ అనే పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన ఆయన ప్రస్తుతం ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. ఉత్తర కర్ణాటకలోని కొప్పల్ జిల్లా గంగావతి నియోజకవర్గం నుంచి గాలి జనార్దన రెడ్డి పోటీ చేస్తున్నారు.
ఇక అలాగే గాలి జనార్దన రెడ్డి భార్య లక్ష్మీ అరుణ బళ్లారి నగరం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరు దంపతులు కూడా కర్ణాటక ఎన్నికల బరిలో నిలిచారు. అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డితోపాటు మరో తొమ్మిది మదిపై 2009లో సిబిఐ కేసులు నమోదు చేసింది.
2011 సెప్టెంబరు 5న జనార్దన్ రెడ్డి అరెస్టు అయ్యారు. ఇటీవల దాఖలు చేసిన నామినేషన్ లో తనపై అక్రమ మైనింగ్కు సంబంధించి 19 కేసులు నమోదయ్యాయని, అవి కోర్టులో వివిధ దశల్లో పెండింగ్లో ఉన్నాయని వివరించారు.