మృగశిర కార్తె సందర్భంగా బత్తెన సోదరులు పంపిణీ చేసే చేప ప్రసాదానికి కరోనా కారణంగా మూడేళ్ళ విరామం తర్వాత తిరిగి శుక్ర, శనివారాలలో చేస్తున్నారు. ఉబ్బసం సమస్యను తగ్గించే చేప మందును ఇవాళ, రేపు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో పంపిణీ చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేప ప్రసాదం పంపిణీని ప్రారంభించారు.
శనివారం ఉదయం 8 వరకు చేప మందు పంపిణీ కొనసాగనుంది. ఆ తర్వాత రెండు రోజుల పాటు బత్తిన గౌడ్ వంశస్థుల ఇంట్లో చేప ప్రసాదం ఇవ్వనున్నారు. రెండు లక్షల వరకు ప్రజలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకోసం అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.
చేప ప్రసాదాన్ని స్వీకరించేందుకు నగరంతో పాటు వివిధ జిల్లాలు, ఇతర రాష్ర్టాల నుంచి వేలాది మంది ఎగ్జిబిషన్ మైదానానికి తరలివచ్చారు. చేపప్రసాదం పంపిణీకి ఏర్పాటు చేసిన క్యూలైన్లలో ఉదయమే బారులు తీరారు. శుక్రవారం ఉదయం పంపిణీని పకడ్బందీగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు.
వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు గురువారం ఉదయం నుంచి ఎగ్జిబిషన్ మైదానంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ జిల్లా ఆర్డీఓ వెంకటేశ్వర్లు, జాయింట్ కమిషనర్ విశ్వ ప్రసాద్, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులతో ఏర్పాటు చేసిన బందోబస్తును పరిశీలించారు.
మత్స్యశాఖ ఆరు లక్షల చేప పిల్లలను సిద్ధంగా ఉంచి అవసరమైన మేరకు ఎగ్జిబిషన్ మైదానానికి తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 32 కౌంటర్ల ద్వారా చేప ప్రసాదం పంపిణీ జరిగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఎగ్జిబిషన్ మైదానానికి ఉబ్బస వ్యాధిగ్రస్తులు, వారి సహాయకులు భారీగా తరలిరావడంతో మైదానం కిటకిటలాడింది. మైదానికి చేరుకున్న వారికి ఫలహారాలు, భోజన సదుపాయాలు కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశాయి. క్యూలైన్లలో జనం నిండిపోయారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
చేప ప్రసాదాన్ని తీసుకొనేందుకు వస్తున్న వేల సంఖ్యలో జనానికి ఆకలి, దాహార్తి వంటి సమస్యలు లేకుండా సేవా సంస్థలు స్వచ్ఛందంగా ముందుకొచ్చాయి. గతంలో లాగే అగర్వాల్ సమాజ్, జైస్వాల్, లింగాయత్ సంఘాలు, మార్వాడీ సంస్థలు రెండురోజులగా వేల మందికి ఫలహారాలు, భోజనాలు, మజ్జిగ, పూరీలు, ఉక్మా, స్వీట్లు, చల్లని పానీయాలు, అల్వ తదితర ఆహారాలు అందించి తమ దాతృత్వాన్ని చాటుతున్నారు. ప్రజలకు స్వచ్ఛమైన మినరల్ వాటర్ ప్యాకెట్లను అందిస్తున్నారు.