పోడు రైతులపై గతంలో నమోదైన కేసులు ఎత్తివేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రకటించారు. శుక్రవారం కొమరంభీమ్ ఆసిఫాబాద్ నూతన కలెక్టరేట్ కార్యాలయంలో పోడు రైతులకు సీఎం కేసీఆర్ పోడు భూముల పట్టాలను అందించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఆసిఫాబాద్ జిల్లాలో మెడికల్ కాలేజీని కూడా నిర్మిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అన్ని జిల్లాల్లోని మారుమూల గ్రామాల రైతులకు వ్యవసాయానికి త్రీఫేజ్ విద్యుత్ ను అందిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇచ్చిన తర్వాత కూడా కేసులు కొనసాగించడం సరైంది కాదని పేర్కొన్నారు.
పోడు భూముల విషయమై గతంలో నమోదైన కేసులను ఎత్తివేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ ను ఆదేశించారు. మహిళల పేరుతోనే పోడు పట్టాల పంపిణీ జరుగుతుందని కేసీఆర్ చెప్పారు. పోడు పట్టాలను పంపిణీ చేయడం తనకు చాలా సంతోషంగా ఉందని కేసీఆర్ తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా లక్షా 51 మంది రైతులకు 4.50 లక్షల ఎకరాల పోడు భూమిని పట్టాలు ఇచ్చి పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక లక్షా 36 వేల మందికి పోడు పట్టాలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. పోడు రైతులకు రైతు బంధు కోసం రూ.24 కోట్లను కూడా మంజూరు చేసిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు.
ఇప్పటివరకు గిరిజన గ్రామాలకు కరెంటు సదుపాయం కల్పన దాదాపు పూర్తయ్యిందని, ఇకపై అన్ని జిల్లాల్లో మారుమూల గ్రామాల్లో ఉన్న గిరిజనుల పొలాలకు కూడా త్రీఫేజ్ కరెంటు ఇస్తామని సీఎం ప్రకటించారు.
కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆర్ధిక మంత్రి టి. హరీష్రావు పాల్గొంటూ ఇక నుంచి గిరిజనులే పోడు భూములకు యజమానులని, వారి భూముల జోలికి ఎవరూ రారని స్పష్టం చేశారు. గిరిజన రైతుల భూములకు పట్టాలతోపాటు రైతుబంధు కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు.
