తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తుల నియామకం జరిగింది. తెలంగాణ, ఎపిలతో సహా ఏడు రాష్ట్రాల హైకోర్టుల కొత్త ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి సుప్రీం కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుతం ఉన్న సీజేలను సుప్రీంకోర్టు జడ్జిలుగా సిఫార్సు చేసింది. దీంతో వీరి స్థానాల్లో కొత్త ప్రధాన నాయమూర్తులను నియమించారు.
కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే పేరును తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిఫార్సు చేసింది. బాంబే హైకోర్టు జడ్జి ధీరజ్ సింగ్ ఠాకూర్ను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సూచించారు. కాగా, ప్రస్తుతం తెలంగాణ, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్ వెంకటనారాయణ భట్టిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ కొలీజియం ఇంతకు ముందే సిఫారసు చేసింది.
అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేస్తున్న జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్ పేరు బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిఫారసు చేసింది. అలాగే గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అలహాబాద్ హైకోర్టు జడ్జి సునీతా అగర్వాల్ పేరును సూచించింది.
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్ పేరును మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సూచించింది. అలాగే ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుభాసిష్ తలపత్ర (ఒడిశా), గుజరాత్ హైకోర్టు జడ్జి జస్టిస్ ఆశిష్ జే దాసాయి పేరును కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా కేంద్రానికి సిఫరాసు చేసింది. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం చేసిన సిఫారసులను రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే న్యాయమూర్తులకు పదోన్నతి లభించనున్నది.