రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు పలు చోట్ల మోస్తరు వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో.. శుక్రవారం ఉదయం 8:30 గంటల నుంచి శనివారం ఉదయం 8:30 గంటల వరకు పలు చోట్ల నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి:
హైదరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్లో అత్యధికంగా 11.5 మి.మీ., శివరాంపల్లిలో 10.5 మి.మీ., టోలిచౌకీలో 10 మి.మీ. వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే నిజామాబాద్లోని భీంగల్లో అత్యధికంగా 107.8 మి.మీ., జయశంకర్లోని ముత్తారం మహాదేవ్పూర్లో 107 మి.మీ., నిర్మల్లో 103, కమ్మరపల్లిలో 100.3 మి.మీ. వర్షపాతం నమోదైంది.
కాగా, రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు భారీ వానలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
శనివారం నుంచి ఆదివారం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతాయని చెప్పింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది.
