భారత్ గ్రీస్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెట్టింపు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గ్రీస్ ఒక రోజు పర్యటన జరిపిన ప్రధాని మోదీ శుక్రవారం ఆ దేశ ప్రధాని రియాకోస్ మిత్సోటాకిస్తో సమావేశమయ్యారు.
అనంతరం ప్రధాని మాట్లాడుతూ వాణిజ్యం, పెట్టుబడులు,రక్షణ, భద్రత, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, విద్య. డిజిటల్ చెల్లింపులు, ఫార్మా, పర్యాటకం, వ్యవసాయం తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించినట్లు తెలిపారు. భారత్గ్రీస్ సంబంధాలను వ్యూహాత్మక వ్యూహాత్మక భాగస్వామిగా ముందుకు తీసుకెళ్లడానికి ఇరువురం అంగీకరించినట్లు తెలిపారు.
“ఇరు దేశాల మధ్య రక్షణ పారిశ్రామిక సహకారాన్ని బలోపేతం చేసేందుకు అంగీకరించాం. జాతీయ భద్రతా సలహాదారుల స్థాయిలో చర్చల వ్యవస్థ ఏర్పాటుకు ముందుకొచ్చాం. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంపైనా దృష్టిసారించాం. భారత్, గ్రీస్ల మధ్య నైపుణ్య వలసలను సులభతరం చేసేందుకు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని నిర్ణయించాం” అని ప్రధాని మోదీ వెల్లడించారు.
ఉక్రెయిన్ సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ, దౌత్యం, చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి ఇరు దేవాలు మద్దతు ఇస్తాయని స్పష్టం చేశారు. గత కొన్నేళ్లుగా భారత్తో తమ సంబంధాలు మెరుగుపడ్డాయని, రెండు దేవాల మధ్య ఆర్థిక, రక్షణ, పర్యాటక రంగాల్లో సహకారానికి అవకాశం ఉందని గ్రీస్ ప్రధాని మిత్సోటాకీస్ చెప్పారు.
అంతకు ముందు దక్షిణాఫ్రికానుంచి ఏథెన్స్కు చేరుకున్న ప్రధానికి విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయం వద్ద గ్రీస్ విదేశాంగ మంత్రి జార్జి గెరాపెట్రిటిస్ ఆయనకు స్వాగతం చెప్పారు. భారత ప్రధాని గ్రీస్లో పర్యటించడం 40 ఏళ్లలో ఇదే మొదటిసారి. అనంతరం ప్రధానికి అధ్యక్ష భవనం వద్ద గౌరవ వందనంతో స్వాగతం పలికారు.
అనంతరం ప్రధాని మోదీ గ్రీస్ అధ్యక్షురాలు కేథరినా ఎన్ సకెల్లారో పౌలౌతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రయాన్3 విజయంపై ప్రధాని మోదీకి అధ్యక్షురాలు అభినందనలు తెలియజేయగా, ఈ విజయం ఒక్క భారత్ది మాత్రమే కాదని, మొత్త మానవాళి విజయమని ప్రధాని చెప్పారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీకి గ్రీస్ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన‘ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ హానర్’ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ విషయంలో గ్రీస్ ప్రజలకు, అధ్యక్షురాలికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ప్రధాని ట్వీట్ చేశారు. భారత్ పట్ల గ్రీస్ ప్రజలకు ఉన్న ఆదరాభిమానాలను ఇది తెలియజేస్తుందని కొనియాడారు.