తిరుమలలో భక్తుల్ని బెంబేలెత్తిస్తున్న మరో చిరుత బోనుకు చిక్కింది. దాదాపు నెల రోజులుగా సాగుతున్న ఆపరేషన్ చిరుతలో భాగంగా అటవీ శాఖ ట్రాప్లో ఐదో చిరుత బోనుకు చిక్కింది. నరసింహ స్వామి ఆలయం 7వ మైలు రాయి వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కడంతో దానిని ఎస్వీ జూకు తరలించారు.
4 రోజుల క్రితమే చిరుతను ట్రాప్ కెమెరాల్లో గుర్తించారు. నడక మార్గాల్లో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుతల కదలికల్ని అధికారులు గుర్తించారు. ఆగష్టు 11న ఆరేళ్ల లక్షితపై చిరుత దాడి చేయడంతో చిరుతల్ని బంధించేందుకు టీటీడీ, అటవీశాఖ ఆపరేషన్ చిరుత ప్రారంభించారు.దీంతో ఇప్పటి వరకు ఐదు చిరుతల్ని అటవీ శాఖ అధికారులు బంధించారు.
శేషాచలం అటవీ ప్రాంతంలో దాదాపు 45 చిరుతలు ఉన్నాయని అటవీ శాఖ లెక్కలు చెబుతున్నాయి. వీటిలో కొన్ని మాత్రమే తిరుమల మెట్ల మార్గానికి సమీపంలోకి వస్తున్నాయి. చిన్నారి లక్షితపై దాడి చేసిన చంపేసిన తర్వాత అలిపిరి మార్గంలో 200కెమెరాలను ఏర్పాటు చేశారు. కొండపైకి చేరుకుని మార్గానిక ఇరువైపులా 500 మీటర్ల పరిధిలో కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిలో చిరుతల కదలికలను అధికారులు గుర్తిస్తున్నారు.
ఈ ఏడాది జూన్ 22న బాలుడు కౌశిక్పై మెట్ల మార్గంలో చిరుత దాడి చేసింది. దానిని చూసిన బంధువులు చిరుత వెంటపడటంతో 500మీటర్ల దూరంలో బాలుడిని వదిలేసి పారిపోయింది. గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయడంతో ప్రాణాపాయం తప్పింది.
తిరుమల నడక మార్గంలో చిరుతల సంచరాన్ని పలుమార్లు గుర్తించినా వాటిని పట్టుకునే ప్రయత్నాలు చేయలేదు. బాలుడిని నోట కరుచుకుని చిరుత వెళ్లడంతో దానిని పట్టుకునేందుకు బోనులు ఏర్పాటు చేశారు. జూన్ 24న బోనులో చిక్కిన చిరుతను నల్లమల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
ఆ తర్వాత నరసింహ స్వామి ఆలయం వద్ద ఆగష్టు 11న నెల్లూరు జిల్లాకు చెందిన లక్షితపై చిరుత దాడి చేసి చంపేసింది. నడక మార్గంలో తిరుమల వెళుతున్న బాలికను దాడి చేసి చంపేయడంతో భక్తులు హడలెత్తిపోయారు. దీంతో టీటీడీ అప్రమత్తమై పెద్ద ఎత్తున దిద్దుబాటు చర్యలు చేపట్టారు. చిరుతల నుంచి భక్తులను కాపాడాలనే ఉద్దేశంతో వాటిని బంధించేందుకు చర్యలు చేపట్టారు.
రెండు నెలల వ్యవధిలోనే ఐదు చిరుతల్ని బంధించడంతో భక్తులకు ఆపాయం తప్పినట్టేనని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఇంకా చిరుతలు ఉన్నాయో లేదో నిర్ధారించనున్నారు. భక్తుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి తెలిపారు.
గురువారం ఉదయం చిరుత చిక్కిన బోను వద్దకు చేరుకున్న చైర్మెన్ భూమన మాట్లాడుతూ ప్రయాణికుల భద్రత విషయంలో భక్తుల క్షేమం విషయంలో, వారి సౌలభ్యం కోసం టీటీడీ పటిష్టమైన చర్యలు తీసుకుంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమేనని పేర్కొన్నారు. అటవీశాఖ అధికారుల సహకారంతో, వారి నిరంతర పర్యవేక్షణలో అలుపెరగకుండా ఆపరేషన్ చిరుత కొనసాగుతున్నదని భరోసా ఇచ్చారు.
నడక దారిలో నడుస్తున్న భక్తులను గుంపులు గుంపులుగా ప్రయాణించమనీ, వారితో పాటు తోడుగా సిబ్బందిని పంపి, ధైర్యాన్ని నింపే ఏర్పాట్లు కొనసాగుతున్నాయని తెలిపారు. కొంత కాలం వరకు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత చిన్న పిల్లల నడిచేందుకు అనుమతి నిరాకరించడం జరిగిందన్నారు.
భక్తులకు భద్రతా సిబ్బంది తోడుగా ఇచ్చి అదనపు భద్రత కల్పిస్తూనే, బుధవారం నుండి అదనంగా భక్తులలో ఆత్మ స్థైర్యం నింపడానికి చేతి కర్రలు ఇవ్వడం జరుగుతున్నదని చెప్పారు.
\