టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు విజయవాడ ఏసీబీ కోర్టులో మరోసారి నిరాశ ఎదురయింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆయన రిమాండ్ ను ఈ నెల 19 వరకు కోర్టు పొడిగించింది. మరోవైపు చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పొడిగింపు పిటిషన్లపై విచారణను కోర్టు శుక్రవారంకు వాయిదా వేసింది.
విచారణ సందర్భంగా ఇరువైపుల న్యాయవాదుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గురువారంతో చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ ముగిసింది. రిమాండ్ పొడిగింపు నేపథ్యంలో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉండనున్నారు. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్కుమార్ దూబే వాదనలు వినిపించగా, ఏపీ సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి వినిపించారు.
బెయిల్, కస్టడీ పిటిషన్లకు సంబంధించి ఇరువైపు వాదనలు విన్న ఏసీబీ న్యాయస్థానం విచారణను శుక్రవారంకు వాయిదా వేసింది. ఏసీబీ కోర్టులో రెండవరోజు చంద్రబాబు తరుపున న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపిస్తూ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబుకు సంబంధం లేదని చెప్పారు. రెండేళ్ల తర్వాత రాజకీయ కారణాలతో కేసులో ఇరికించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
“డిజైన్ టెక్ సంస్థతో ఇతర సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. చంద్రబాబు సిఎం హోదాలో స్కిల్ డెవలప్ మెంట్ స్కీం కు నిధులు మాత్రమే మంజూరు చేశారు. ఆ తర్వాత ఒప్పందం ప్రకారం నలభై సెంటర్లను ఏర్పాటు చేశారు. రెండు లక్షల మందికి పైగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించారు. అంతా ఓపెన్ గా జరిగితే ఇందులో స్కాం ఎక్కడుంది? చంద్రబాబు పాత్ర ఏముంది?” అని ప్రశ్నించారు.
ఇది పూర్తి గా రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని స్పష్టం చేశారు. చంద్రబాబు అవినీతి చేసినట్లు ఆధారాలు కూడా చూపించలేదని పేర్కొంటూ ఇప్పటికే కస్టడీ లో చంద్రబాబు విచారణ అధికారులకు సహకరించారని తెలిపారు. ఇక కస్టడీ కూడా అవసరం లేదంటూ అయినా విచారణ సాగదీయడానికే ఈ పిటిషన్ వేశారని ఆరోపించారు.
ఏపీ సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ చంద్రబాబు పాత్రకు సంబంధించి మరిన్ని డాక్యుమెంట్లను సీఐడీ తరపున కోర్టుకు సమర్పించారు. డొల్ల కంపెనీల పేరుతో నిధులు కొట్టేశారని, హవాలా రూపంలో నిధులను కొట్టేశారని తెలిపారు. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని, మరింత విచారించేందుకు వీలుగా సీఐడీ కస్టడీకి అప్పగించాలని ఆయన కోర్టును కోరారు.