కేంద్ర ప్రభుత్వం 202324 రబీ పంటకాలానికి ఎరువులపై సబ్సిడీని ఖరారు చేసింది. ఫాస్పేటిక్, పొటాసిక్ (పికె) ఏరువులపై రూ 22,303 కోట్ల సబ్సిడీని కల్పించే నిర్ణయానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది.
ఇందులో రబీసీజన్కు పంటలకు వేసే బలవర్థక ఎరువులపై తగ్గింపు ధరల సబ్సిడీ కొనసాగుతుందని ఇప్పుడు ప్రధానమైన భూసార పోషకం డిఎపి బ్యాగుకు రూ 1350కి విక్రయించడం కొనసాగుతుందని కేబినెట్ భేటీ తరువాత వివరాలను కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం విలేకరులకు తెలిపారు.
ఫాస్పరస్, పొటాసియం ఎరువులకు సంబంధించి ఈ రబీ సీజన్కు ఖరారు చేసిన పౌష్టిక ప్రాతిపదిక పదార్థాలపై సబ్సిడీ (ఎన్బిఎస్) ధరలు ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకూ సాగుతాయని మంత్రి వెల్లడించారు. రైతాంగానికి అందుబాటు ధరలలో అవసరమైన రీతిలో ఎరువులు దొరికేలా చూస్తారని చెప్పారు.
మే నెలలో కేంద్ర కేబినెట్ సమావేశంలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఎరువులపై సబ్సిడీని రూ 38,000 కోట్లుగా ఖరారు చేశారు. ఖరీఫ్ సీజన్లో మాదిరిగానే ఇప్పుడు కూడా 50 కిలోల డిఎపి ఎరువు బస్తా రూ 1,350గా ఉంటుందని వివరించారు. ఇక ఎన్పికె ప్రతి సంచీ ధర రూ 1470గా ఉంటుంది.
కాగా సింగిల్ సూపర్ ఫాస్పేట్ (ఎస్ఎస్పి) ధర బ్యాగుకు రూ 500గా ఉంటుంది. మ్యురియేట్ ఆఫ్ పోటాష్ ధర బ్యాగుకు ఇంతకు ముందు రూ 1700 ఉండగా దీనిని స్వల్పంగా తగ్గించి రూ 1655గా ఖరారు చేశారు. కేంద్ర కేబినెట్ ఉత్తరాఖండ్కు సంబంధించి మరో నిర్ణయానికి ఆమోదం తెలిపింది.
జమ్రాని డ్యామ్ బహుళార్థక సాధక ప్రాజెక్టును ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన ఆధ్వర్యపు సాగునీటి పారుదల ఉపయుక్త ప్రాజెక్టులోకి చేర్చారు. ఈ ప్రాజెక్టుకు రూ 2584 వ్యయం అవుతుంది.