టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ సీఐడీ మరో కేసు నమోదు చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమాలు జరిగాయంటూ ఏపీ ఎండీసీ చేసిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. ఇందులో ఏ1గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబులను పేర్కొన్నారు. ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ4గా దేవినేని ఉమల పేర్లను చేర్చారు.
ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం చేకూర్చేలా వ్యవహరించారని ఏపీఎండీసీ చేసిన ఫిర్యాదును సీఐడీ స్వీకరించింది. మైన్స్ అధికారుల ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సీఐడీ. ఉచిత ఇసుక ముసుగులో రూ.10 వేల కోట్ల దోపిడీ జరిగినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. చంద్రబాబు హయాంలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయని వైసీపీ ఆరోపిస్తోంది.
చంద్రబాబు ఇంటి పక్కనే అక్రమ తవ్వకాలు జరిగినా చంద్రబాబు పట్టించుకోవట్లేదని అంటున్నారు. అంతే కాదు.. చంద్రబాబు పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నాడు రూ.100 కోట్ల జరిమానా విధించిందని తెలిపారు. ఇక ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుపడ్డ ఓ మహిళా ఎమ్మార్వోపై నాటి ఎమ్మెల్యే.. చింతమనేని దాడికి తెగబడ్డారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ వ్యవహారంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూసీ చూడనట్లు వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే పలు కేసులను ఎదుర్కొంటున్న చంద్రబాబుపై ఇది 5వ కేసు. చంద్రబాబుపై ఇప్పటివరకు స్కిల్ డెవలప్ మెంట్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఫైబర్ గ్రిడ్ కేసు, మద్యం అనుమతుల కేసు నమోదైన సంగతి తెలిసిందే.