ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ 14గా ఉన్న టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అరెస్ట్ కోసం సీఐడీ కోర్టు అనుమతి కోరింది. నారా లోకేష్ యువగళం సభలో, పలు ఇంటర్వ్యూ లలో చేసిన వ్యాఖ్యల పైన సీఐడీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఇదే కేసులో లోకేష్ రెండు సార్లు సీఐడీ ఎదుట విచారణకు హాజరయ్యారు.
లోకేష్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారని, అరెస్ట్ వారెంట్ జారీ చేయాలంటూ కోర్టులో సీఐడీ పిటీషన్ దాఖలు చేసింది. టీడీపీ నేత నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఐడీ కోర్టులో మొమో దాఖలు చేసింది. లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆధారాలతో సహా ఏసీబీ కోర్టుకు సీఐడీ అందచేసింది.
కాగా, యువగళం ముగింపు సందర్భంగా పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చంద్రబాబు స్కిల్ స్కాం కేసుల దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యానించారని సీఐడీ ఆరోపిస్తోంది. చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించటంతో పాటుగా రిమాండ్ విధించటం తప్పని విమర్శిస్తున్నారు.
ఏసీబీ న్యాయమూర్తికి దురుద్దేశఆలను ఆపాదించే విధంగా లోకేష్ వ్యాఖ్యలున్నాయంటూ సీఐడీ తన మెమోలో పేర్కొంది.స్కిల్ స్కామ్, ఐఆర్ఆర్, ఫైబర్ నెట్ స్కామ్ కేసులలో అప్పటి సీఎం హోదాలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని, తమ అభ్యంతరాలను పట్టించుకోలేదని టీడీపీ ప్రభుత్వంలో పని చేసిన ఉన్నతాధికారులు ఇప్పటికే న్యాయమూర్తి ఎదుట 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇచ్చారు.
ఆ వాంగ్మూలాలను తప్పు బట్టే విధంగా లోకేష్ వ్యాఖ్యలు ఉన్నాయని సీఐడీ అభిప్రాయపడుతోంది. విచారణలో ఉన్న అధికారుల పేర్లు రెడ్ బుక్ లో రికార్డు చేశానని, తమ ప్రభుత్వం వస్తే వారి సంగతి తేలుస్తామంటూ లోకేష్ చేసిన హెచ్చరికలను సీఐడీ మెమోలో ప్రస్తావించింది. సాక్షులను బెదిరించి కేసు దర్యాప్తును పక్కదారి పట్టించాలనేది లోకేష్ ఉద్దేశంగా సీఐడీ మెమోలో పేర్కొంది. 41ఏ నోటీసుల్లో పేర్కొన్న షరతులకు ఇది విరుద్దమని సీఐడీ వివరించింది.