కాళేశ్వరం ప్రారంభించినప్పటి నుంచి అనుమానాలున్నాయని, వీటిపై న్యాయ విచారణ జరుపుతామని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మేడిగడ్డ కుంగినప్పటి నుంచి ఇప్పటి వరకూ కేసీఆర్ స్పందించలేదని నిర్మించారు.
కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీని ఐదుగురు మంత్రుల బృందం పరిశీలించింది. శుక్రవారం మధ్యాహ్నం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రులకు నీటిపారుదల శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గతం నుంచి తాము చెబుతూ వచ్చిన విషయాలే నిజమయ్యాయని, త్వరలో ఇందులో అవకతవకలపై న్యాయ విచారణ చేపడతామని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్బాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వం రాజకీయ మతలబులతో ప్రాజెక్టుతో ఆదాయం ఎక్కువ చూపారని, కానీ రూపాయికి 52 పైసలు మాత్రమే ప్రయోజనం కలిగేలా ఉందని మంత్రులు ధ్వజమెత్తారు.
కాళేశ్వరం కింద ఎకరాకు నీరు ఇచ్చేందుకు రూ.46 వేలు ఖర్చు అవుతోందని, రైతులకు ఆదాయం సాగు మాత్రమేనని మంత్రులు చెప్పారు. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్లో 90 శాతం ఎత్తిపోతలకే పోతోందని తెలిపారు. ఆనకట్టల్లో నీటి నిల్వ భారం ఎక్కువ కావడం వల్ల దెబ్బతిన్నాయని, కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రజలపై ఊహించనంత భారం పడబోతోందని పేర్కొన్నారు.
ప్రాజెక్టు రీ డిజైనింగ్లో రాజకీయ, ఇతర కోణాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతూ ఎన్నికల ముందు అప్పటి అధికార పార్టీకి అధికారులు అనుకూలంగా ప్రకటన ఇచ్చారని, తాము లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు ఈఎన్సీ లిఖిత పూర్వకంగా సమాధానాలు ఇవ్వాలని సూచించారు.
ప్రాణహిత పూర్తి అయితే కాంగ్రెస్కు పేరు వస్తుందనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ విషయంపై మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత ప్రభుత్వ తీరును తప్పు పట్టారు.
కేసీఆర్ మార్కు ఉండాలనే తాపత్రయం తప్ప, రాష్ట్ర ప్రయోజనాలు గాలికి వదిలేశారని విమర్శలు గుప్పించారు. డయా ఫ్రాం వాల్ ఆర్సీసీతో కట్టి ఉంటే ప్రమాదం జరిగేదా అని ప్రశ్నించారు. సీకెండ్ ఫైల్ ఫెయిల్ అయినందుకే రోజురోజుకు కుంగిపోయిందని చెప్పారు. ప్రొటెక్షన్ పనులు ఒక్క వరదకే పోతే పనులు ఎంత నాసిరకంగా చేశారో అర్థమవుతోందని విమర్శించారు.