తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ఎ త్తిపోతల సాగునీటి పథకం పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను నిగ్గుతేల్చేందుకు తాము సిద్ధంగానే ఉన్నట్టు హై కోర్టుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ స్పష్టం చేసిం ది. హైకోర్టు ఆదేశాలిచ్చినా ,లేదా రాష్ట్ర ప్రభు త్వం కోరినా కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తు చేపడతామని వెల్లడించింది.
అయితే దర్యాప్తునకు అ వసరమైన వసతులు ఆర్ధిక వనరులు కల్పించాల్సివుంటుందని సిబిఐ కోర్టుకు తెలిపింది. కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకంలో పెద్దఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని, డిజైన్లలో మార్పులు చేర్పులు జరిగాయని, పనులు నాశిరకంగా చేసి, అంచనాలు పెంచి భారీగా సోమ్ముచేసుకున్నారని, ప్రజాధనం పక్కదారి పట్టిందన్న ఆరోపణలు చెలరేగాయి.
ఈ అంశంపై దర్యాప్తు చేపట్టాలని సిబిఐకి చేసిన ఫిర్యాదులలో కోరినప్పటికీ సిబిఐ నుంచి స్పందనరాలేదని పేర్కొంటూ న్యాయవాది రామ్మోహన్రెడ్డి తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ను విచారణకు చేపట్టిన హైకోర్టు కాళేశ్వరంపై దర్యాప్తు విషయంలో దాఖలైన పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు సిబిఐకి సూచించింది.
ఈ నేపధ్యంలోనే సిబిఐ హైదరాబాద్ బ్రాంచ్కి చెందిన ప్రధానఅధికారి డి.కళ్యాణ్ చక్రవర్తి హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. అందులో పలు అంశాలను న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. కాళేశ్వరం ఎతిపోతల సాగునీటి పధకంలో అవినీతి అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపైన నేరుగా కల్పించుకుని దర్యాప్తు చేయలేమని తెలిపారు. ఈ అంశంలో సిబిఐకి పరిమితులు ఉన్నట్టు తెలిపారు.
అంతే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం అవరమైన రుణసదుపాయం కల్పించి నిధులు అందజేసిన ఆర్ధిక సంస్థలనుంచిగాని, బ్యాంకుల నుంచిగాని సిబిఐకి ఎటువంటి ఫిర్యాదులు అందలేదని వెల్లడించారు. అయితే ఇదే అంశపై పిటీషనర్ దాఖలు చేసిన ఫిర్యాదుపైన పరిశీలన జరుగుతున్నట్టు తెలిపారు.
ఈ అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సంబంధించి ఎవరి పాత్ర ఎంత అన్నది తెలియాల్సివుందన్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారుల పాత్రవుంటే విచారణకు అవకాశాలు ఉంటాయని, అదే రాష్ట్ర ప్రభుత్వ ఆధికారుల ప్రమేయం ఉంటే మాత్రం నేరుగా జోక్యం చేసకునే అవకాశం సిబిఐకి ఉండదని వివరించారు.
ఈ వ్యవహారంలో హైకోర్టు ఆదేశించినా, లేదా రాష్ట్ర ప్రభుత్వం కోరినా దర్యాప్తు చేసేందుకు సిబిఐ సిద్దంగా ఉందని తెలిపారు. అయితే దర్యాప్తునకు అవసరమైన వసతులు, వనరులు ఇతర సదుపాయాలను ప్రభుత్వం కల్పించాలని స్పష్టం చేశారు.
ఇందుకోసం అదనపు ఎస్పీ స్థాయి అధికారితోపాటు ముగ్గురు డిఎస్సీలు, ఆరుగురు సిఐలు, నలుగురు ఎస్ఐలతో కూడిన సిబ్బంది అవసరం ఉంటుందని వివరిస్తూ సిబిఐ హైదరాబాద్ విభాగం ప్రధానాధికారి కళ్యాణ్ చక్రవర్తి హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ పిటీషన్లో పేర్కొన్నారు. ఈ కేసును విచారించిన హైకోర్టు ఈ అంశాన్ని ఫ్రిబ్రవరి 2న విచారణ చేస్తామని పేర్కొంటూ కేసును వాయిదా వేసింది.