భారత్తో సంబంధాలు దిగజారిన నేపథ్యంలో మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ ప్రతిపక్షాల నుండి పదవీగండం సంకేతాలు వెలువడుతున్నాయి. పార్లమెంట్లో ముయిజ్జూ అభిశంసన కోసం విపక్షాలు సిద్ధపడుతున్నాయి. మాల్దీవియన్ డెమొక్రాటిక్ పార్టీ (ఎండీపీ) పార్లమెంటరీ గ్రూప్ ముయిజ్జూ అభిశంసన తీర్మానానికి అంగీకరించింది.
చైనా అనుకూలుడైన ముయిజ్జూకు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు డెమొక్రాట్లతోపాటు ఎండీపీ సభ్యులు సంతకాలు సేకరించారు. అధ్యక్షుడైన ముయిజ్జూ న్యూఢిల్లీతో సంబంధాలకు విఘాతం కలిగించిన నేపథ్యంలో తాము ఈ తీర్మానాన్ని తీసుకొచ్చామని మాల్దీవుల పార్లమెంటు సభ్యుడొకరు తెలిపారు.
అంతకుముందు జనవరి 8న పార్లమెంటరీ మైనారిటీ నాయకుడు అలీ అజీమ్ పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం ద్వారా అధ్యక్షుణ్ని గద్దె దించాలని కోరారు. మాల్దీవులు విదేశాంగ విధాన స్థిరత్వాన్ని నిలబెట్టడానికి, పొరుగు దేశాలకు దూరం కాకుండా ఉండేందుకు ఇదెంతో అవసరమని అజీమ్ స్పష్టం చేశారు.
అభిశంసన తీర్మానం విషయమై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాదోపవాదనలతో మాల్దీవులు పార్లమెంట్ అట్టుడుకుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనకు సంబంధించిన ఫోటోలపై మాల్దీవులు డిప్యూటీ మంత్రి మరియం షియునా అనుచిత వ్యాఖ్యల తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి.
ప్రధాని మోదీని హస్యకాడు, ఇజ్రాయెల్ కీలుబొమ్మగా ఆమె అభివర్ణించారు. ఆ తర్వాత మాల్దీవులకు చెందిన పలువురు మంత్రులు సైతం ఇదే తరహాలో మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో భారతీయులు `బాయ్కాట్ మాల్దీవులు’ అని పిలుపునిచ్చారు. మాల్దీవులు మంత్రుల వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను దెబ్బతీశాయి.
దీంతో మాల్దీవులు ప్రభుత్వం దిగొచ్చింది. మోదీపై, భారత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులను సస్పెండ్ చేసింది. మరుసటి రోజే మాల్దీవులు రాయబారిని పిలిపించిన భారత విదేశాంగ శాఖ ఆయనకు తన నిరసనను వ్యక్తం చేసింది. భారత్తో వివాదం నేపథ్యంలో మాల్దీవులు రాజధాని మాలే మేయర్ పీఠం కోసం నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్షుడు ముయిజ్జూకు చెందిన చైనా అనుకూల పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ఓటమిపాలైంది.
అప్పటి దాకా ముయిజ్జూ మాలే మేయర్గా వ్యవహరించగా ప్రతిపక్ష ఎండీపీకి చెందిన ఆదమ్ అజీమ్ ఆ పీఠాన్ని సొంతం చేసుకున్నారు. భారత్తో వివాదం సమయంలోనే మాల్దీవులు అధ్యక్షుడు ముయిజ్జూ చైనా పర్యటనకు వెళ్లొచ్చారు. భారత సైన్యం తమ దేశాన్ని వదిలి వెళ్లేందుకు డెడ్ లైన్ విధించిన ముయిజ్జూ ప్రభుత్వం చైనా నిఘా నౌకను తమ జలాల్లో నిలిపి ఉంచేందుకు అంగీకరించింది.
ఈ పరిణామాలను భారత్ అనుకూల మాల్దీవులు ప్రతిపక్షం ఖండిస్తోంది. భారత్ను దూరం చేసుకోవద్దని విపక్ష నేతలు మాల్దీవులు ప్రభుత్వానికి హితవు పలికారు.
